(నెల్లూరు,న్యూస్ఇన్)
డబ్బుతో చేసే రాజకీయాలే ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమిస్తున్నాయని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలోకి రావాల్సిన వాళ్లు కష్టపడడం నేర్చుకోవాలని ,నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలని సూచించారు. వెంకయ్య నాయుడు 50 సంవత్సరాల రాజకీయ, జీవన ప్రస్థానాన్ని తెలియజేస్తూ సీనియర్ జర్నలిస్టు మాశర్మ రచించిన “వెంకయ్య నాయకుడు” పుస్తకాన్ని నెల్లూరులోని వి.పి.ఆర్. కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం పరిచయం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ‘‘రాజకీయాల్లోకి యువత రావాల్సిన అవసరం ఉంది. అయితే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న యువత నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలి. క్రమశిక్షణతో ఉండాలి. సంస్కారవంతమైన రాజకీయాలు చేయండి.

ఈ రోజు కొంతమంది కుల, మత, వర్గాల పేరుతో, భాష పేరుతో, జిల్లా పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న చిన్న విషయాలకే కులం పేరుతో పెద్ద వారిని అందులో అనవసరంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. నాయకుల వ్యక్తిత్వం, సమర్థత, ప్రవర్తన తదితర గుణ గణాలను చూసి ఎన్నుకోవాలి. అప్పుడే రాష్ట్ర ప్రతిష్ఠ, దేశ ప్రతిష్ఠ ఇనుమడిస్తాయి.’’ అని స్పష్టం చేశారు. ‘‘నేతలు అన్ని వేదికలపై సంస్కారవంతంగా ఉండాలి. డబ్బు రాజకీయాలతో ప్రజాస్వామ్యానికి జబ్బు చేస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యం బలహీనపడుతుందన్నారు. సమాజంలో విలువల పతనం, సంప్రదాయాల పతనం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ తిరిగి విలువలతో కూడిన రాజకీయం, సిద్ధాంతాలతో కూడిన రాజకీయం రావాలని ఆకాంక్షించారు. ఉచిత పథకాలు మంచిది కాదని,అనుచితమని స్పష్టం చేశారు. విద్య, వైద్యం మాత్రమే పేదలకు ఉచితంగా ఇవ్వాలన్నారు.












Leave a Reply