(హైదరాబాద్,న్యూస్ఇన్)
హైదరాబాద్ నగరంలో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోంది. బయట ఏం కొనాలన్న, తినాలన్నా ఒకటికి రెండు సార్లు కాదు పది సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. విచ్చల విడిగా మార్కెట్లో లభ్యమవుతున్న కల్తీ పదార్థాలు ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నాయి. ఏ పదార్థం తీసుకున్నా….కల్తీ లేదని చెప్పలేని పరిస్థితి ఉంది. ఇందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెచ్ ఫాస్ట్ దాడులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో హెచ్ ఫాస్ట్ అధికారులు వివిధ చోట్ల దాడులు నిర్వహించారు. ఎన్నో కల్తీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక హోటళ్లలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నాన్ వెజిటిరియన్ ఫుడ్ లో కల్తీ విచ్చల విడిగా జరుగుతోందని అధికారులు హోటళ్లలోనే తేల్చారు. వంద రోజుల్లో నగరవ్యాప్తంగా వివిధ జోన్ల పరిధిలో మొత్తం 185 కేసులు నమోదు చేసి, సుమారు 121.87 టన్నుల ప్రమాదకరమైన కల్తీ ఆహార పదార్థాలను హెచ్ ఫాస్ట్ స్వాధీనం చేసుకుంది. స్వచ్ఛమైన ఆహారంతో నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తే, నేడు కల్తీ విషం వల్ల సగటు ఆయుష్షు సగానికి పడిపోతోంది. రసాయనాలు, నాణ్యత లేని నిల్వ పదార్థాల వాడకం వల్ల పసిబిడ్డల ఎదుగుదల దెబ్బతింటోంది. చిన్నవయస్సులోనే పెద్ద రోగాల బారిన ఎంతో మంది పడుతున్నారు. ఆ కారణంగా అటు ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు కుటుంబ ఆర్ధిక పరిస్థితి అయోమయంగా మారుతోంది.

కల్తీ పదార్థాలు…..
60 టన్నుల కంటే ఎక్కువ చికెన్ను స్వాధీనం
9,260 కేజీల నిల్వ పచ్చళ్లు,
4,030 కేజీల కల్తీ కోవా,
3,897 కేజీల నకిలీ టీ పొడి,
15 టన్నుల నాణ్యత లేని చికెన్/మాంసం
3,260 కేజీల కల్తీ క్రీమ్
530 కేజీల కల్తీ నెయ్యి
1,514 కేజీల కల్తీ పనీర్
2,500 కేజీల కల్తీ పెరుగు
కృత్రిమ రసాయనాలతో పండ్లను మగ్గబెట్టిన 25,845 కేజీల పండ్లను సీజ్ చేశారు.
247 కేసులు ఫుడ్ సేఫ్టీ విభాగానికి బదిలీ….
పోలీసు చర్యలతో పాటు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్(ఎఫ్ఎస్ఓ)లకు తదుపరి చర్యల నిమిత్తం 247 కేసులు అప్పగించారు. ఇందులో అత్యధికంగా పనీర్ అవుట్లెట్లపై 70 కేసులు, ప్రజల నుంచి నేరుగా వచ్చిన ఫిర్యాదులపై 90 కేసులు నమోదు చేశారు. అలాగే సమోసా తయారీ కేంద్రాలపై 11, వాటర్ ప్యాకింగ్ ప్లాంట్లపై 9, మసాలాలు/స్పైసెస్ పై 7, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలపై చెరో 6 కేసులు, జెప్టోపై 5, హాస్టళ్లు, మాంసం దుకాణాలపై చెరో 4 కేసులు, ఐస్ తయారీ కేంద్రాలపై 3, చికెన్ వేస్ట్/సీ ఫుడ్పై 3 కేసులు దాఖలయ్యాయి.
కల్తీ మాఫియా పై పీడీ కేసులు……

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రతి రోజు సగటున 15 వరకు కల్తీ ఆహార సమాచారాన్ని ప్రజలు అందిస్తున్నారని అధికారులు తెలిపారు. విషపూరిత రసాయనాల వాడకం వల్ల చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదల పూర్తిగా దెబ్బతింటోంది. శారీరక సామర్థ్యం దెబ్బతింటే మానవ వనరుల ఉత్పాదకత తగ్గి, దేశ ఆర్థిక వ్యవస్థే చిన్నాభిన్నమవుతుంది. అందుకే ఈ దందాను మేము కేవలం ఒక చిన్నపాటి వ్యాపార మోసంగానో లేదా నిబంధనల ఉల్లంఘనగానో చూడటం లేదు; ఇది ప్రజల ఆరోగ్యంతో, అమాయకుల ప్రాణాలతో ఆడుకునే ఒక ఘోరమైన హత్యాయత్నం. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ వారి ప్రాణాలను హరించే కల్తీ మాఫియాపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి కూడా వెనుకాడబోమని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ హెచ్చరించారు.












Leave a Reply