(అమరావతి,న్యూస్ఇన్)
వారం రోజుల జిల్లాల పర్యటన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం తిరిగి అమరావతికి రానున్నారు. సోమవారం ఆర్టీజీఎస్ సమీక్షతో సహా పలు సమావేశాలు నిర్వహించనున్నారు. వారం రోజులు క్షణం తీరిక లేకుండా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు… మొత్తం 4 జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ఎంవోయూలు, సంక్షేమ కార్యక్రమాలు, రైతులు-ప్రజలతో ముఖాముఖి వంటి సమావేశాలతో పర్యటన సాగింది. ఈనెల 1వ తేదీన అమరావతి నుంచి బయలుదేరి నేరుగా నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం పున్నపువారిపాలెం చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడ నిర్వహించిన పేదల సేవలో కార్యక్రమంలో మొదట పాల్గొన్నారు. గ్రామంలోని ఎస్సీ కాలనీకి వెళ్లిన సీఎం చంద్రబాబు పద్మమ్మకు ఎన్టీఆర్ భరోసా వితంతు పింఛను, తులశమ్మకు దివ్యాంగ పింఛన్ అందించారు. అనంతరం సభలో మాట్లాడుతూ ఇప్పటి వరకూ రూ.68,598 కోట్ల మేర పెన్షన్ల కింద కూటమి ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు. అభివృద్దిలో సంపద సృష్టిలో నెల్లూరు జిల్లా దేశంలోనే అగ్రగామి జిల్లాగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే, తర్వలో నెల్లూరు జిల్లాలో మెగా ఫర్నిచర్ పార్కు కూడా ఏర్పాటు కానుందని చెప్పారు. జిల్లాకు అత్యంత కీలకమైన వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు ఇస్తామని ప్రకటించారు.

వీబీ జీ రామ్ జీ ప్రారంభం
2వ తేదీ ఉదయం కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం వీబీ జీ రామ్ జీని తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నుంచి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి ప్రారంభించారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ పథకం అమల్లోకి వచ్చింది. ముక్కవారిపల్లి గ్రామంలో రూ.4.55 లక్షల వ్యయంతో ప్రతిపాదించిన మూడు పనుల్ని ముగ్గురు నేతలూ లాంఛనంగా ప్రారంభించారు.
రాయల సీమ స్టీల్ పనుల ప్రారంభం
రాయలసీమ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చేలా ఈనెల 3న కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపు రాళ్ల పల్లిలో జిందాల్ సౌత్ వెస్ట్ రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. జేఎస్డబ్ల్యూ చైర్మన్, సీఎండీ సజ్జన్ జిందాల్, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మలతో కలిసి సీఎం ప్లాంట్ పనులకు శ్రీకారం చుట్టారు. రాయల సీమ స్టీల్ ప్లాంట్తో పాటు అనుబంధంగా నిర్మిస్తున్న జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ సోలార్ క్యాప్టివ్ పవర్ ప్రాజెక్టు పనులూ సీఎం ప్రారంభించారు.

కుప్పంలో 3 రోజుల పర్యటన
ఈనెల 3వ తేదీన కడప నుంచి నేరుగా ముఖ్యమంత్రి 3 రోజుల పర్యటన కోసం కుప్పం వచ్చారు. గుడుపల్లె మండలం పొగురుపల్లిలో నిర్వహించిన ‘స్వర్ణ కుప్పం–పెట్టుబడుల వేదిక’ బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రూ.9,322 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 30 ప్రాజెక్టులకు ఎంవోయూలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వీటితో ప్రత్యక్షంగా 39,535 మందికి, పరోక్షంగా 47,539 మందికి ఉద్యోగాలు వస్తాయి.












Leave a Reply