(న్యూస్ఇన్,హైదరాబాద్)
హైదరాబాద్లోని రాయదుర్గం భూ వేలంలో రికార్డు ధర పలికింది. ఎకరా 266.53 కోట్ల రూపాయల ధర కు కొనుగోలు చేసేందుకు రియల్టర్లు ముందుకు వచ్చారు. ఈ ప్రాంతంలో రోజు రోజుకు భూముల ధరలు పాత రికార్డులను తిరిగి రాస్తున్నాయి.టీజీఐఐసీ నిర్వహించిన తాజా భూముల వేలం భారీ స్పందనను లభించింది. రాయదుర్గ్ లోని 5.38 ఎకరాల విస్తీర్ణం కలిగిన ప్లాట్-పీ2ను ఎకరాకు రూ.269 కోట్ల ధరకు వేలం వేయగా.. మొత్తం రూ.1,447.22 కోట్ల ఆదాయం లభించింది. ఇదే క్రమంలో గత వారం నిర్వహించిన ప్లాట్-పీ1 వేలం కూడా అత్యంత భారీ ధరను నమోదు చేసింది. 5.25 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ ప్లాట్ ఎకరాకు రూ.264 కోట్ల ధర పలకగా.. మొత్తం రూ.1,386 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో వేలం విలువలో 25 శాతం మొత్తాన్ని తొలి దశ చెల్లింపుగా ఇప్పటికే ప్రభుత్వం అందుకుంది. తాజాగా నిర్వహించిన పీ2 వేలం ఫలితాన్ని, గత వారం పీ1 వేలం ఫలితాన్ని కలిపి చూస్తే.. కేవలం 10.63 ఎకరాల భూమి ద్వారా టీజీఐఐసీకి ఏకంగా రూ.2,833.22 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ రెండు వేలాల్లో ఎకరాకు సగటున రూ.266.53 కోట్ల ధర లభించడం విశేషం.
పెట్టుబడిదారుల నమ్మకానికి నిదర్శనం….

కేవలం వారం రోజుల వ్యవధిలో నిర్వహించిన రెండు వేలాల్లోనూ ఎకరాకు రూ.260 కోట్లకు పైగా ధర పలకడం రాయదుర్గ్ ప్రాంతంపై పెట్టుబడిదారులలో ఉన్న బలమైన ఆసక్తికి అద్దం పడుతోంది. ఈ కారిడార్పై ప్రముఖ డెవలపర్లు, పెట్టుబడిదారుల్లో ఉన్న విశ్వాసాన్ని ఈ ధరల వెల్లడి స్పష్టంగా చాటుతోంది. హైదరాబాద్ భవిష్యత్ అభివృద్ధి అవకాశాలపై పెట్టుబడిదారుల్లో నమ్మకం కలిగిస్తున్నాయి.
ఎంఎస్టీసీ వేదికగా వేలం….
ఈ భూముల వేలం ప్రక్రియను ఎంఎస్టీసీ ఈ-ఆక్షన్ వేదిక ద్వారా నిర్వహించారు. టీజీఐఐసీకి ప్రత్యేక లావాదేవీ సలహాదారుగా జేఎల్ఎల్ వ్యవహరించింది. మార్కెట్లో భూములకు సరైన స్థానం కల్పించడం, పెట్టుబడిదారులను ఆకర్షించడం, వారితో అనుసంధానం చేయడం, పోటీ ధరల వెల్లడి జరిగేలా చూడడంలో జేఎల్ఎల్ సహకారం అందించింది.కేవలం 10.63 ఎకరాల భూమితో రూ.2,833.22 కోట్ల ఆదాయం రావడంఈ ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యతను మరోసారి నిరూపించింది.











Leave a Reply