(న్యూస్ఇన్, హైదరాబాద్)
నిషేధిత భూముల జాబితా (22A)ను అడ్డుపెట్టుకుని లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అంతేకాకుండా రాష్ట్రంలో జరుగుతున్న భూ బదిలీలు, చీకటి ఒప్పందాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎలాంటి కారణం లేకుండా కొన్ని భూములను 22A జాబితా నుంచి తొలగించి, మరికొన్ని కొత్త భూములను అందులో చేర్చడం ద్వారా పాలకులే స్వార్థ ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. కుట్రలు జరగట్లేదని ముఖ్యమంత్రి బుకాయిస్తున్నారని, కానీ ఈ కుట్రదారులు ఎవరో ప్రభుత్వం బహిర్గతం చేయాలని నిలదీశారు.
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన బినామీ, షెల్ కంపెనీలకు సుమారు 15 వేల కోట్ల రూపాయల ఆస్తులు అక్రమంగా బదిలీ అయ్యాయని, క్యాబినెట్ మంత్రిగా ఉంటూ సొంత కంపెనీలకు లబ్ది చేకూర్చుకోవడం దారుణమని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వంలో ‘ధరణి’ పేరుతో జరిగిన దోపిడీని తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్ నాయకులు, నేడు అదే విధానాన్ని ‘భూ భారతి’ పేరుతో మంత్రులకు వజ్రాల హరతిగా మలుచుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
ఈ భారీ అవినీతి వ్యవహారంపై రాహుల్ గాంధీకి ఇంగ్లీష్, తెలుగు భాషలలో బహిరంగ లేఖ రాసినట్లు మహేశ్వర్ రెడ్డి తెలిపారు. కేవలం చేతిలో రాజ్యాంగం పుస్తకం పట్టుకుని తిరగడం కాకుండా, రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేస్తున్న ఈ అక్రమాలపై రాహుల్ గాంధీ బాధ్యత వహించాలన్నారు.ఈ భూ లావాదేవీలపై సీబీఐతో లేదా సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ (ఫోరెన్సిక్ ఆడిట్) జరిపించాలని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం స్పందించకుంటే అసెంబ్లీ ముట్టడి….
రాష్ట్రంలో భూ భారతి 22A (నిషేధిత భూముల జాబితా) అంశానికి సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులపై గత నెల రోజులుగా కొనసాగుతున్న పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించినట్టు బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద వచ్చే నెల 5, 6 తేదీల్లో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, భూములను నిషేధిత జాబితాలో చేర్చబడిన బాధితులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించి భూ భారతి 22A, సమస్యపై చర్యలు తీసుకోకపోతే బీజేపీ పక్షాన ‘అసెంబ్లీ ముట్టడి’ కార్యక్రమాన్ని చేపడతామని ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు.












Leave a Reply