NewsInn

News in a Click

తమ్మిడిహట్టి పై సెప్టెంబర్‌ 1న ఢిల్లీలో సమావేశం

(న్యూస్ఇన్‌, హైద‌రాబాద్‌)

తమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణంపై సెప్టెంబ‌ర్ ఒక‌టో తేదీన ఢిల్లీలో కీల‌క స‌మావేశం జ‌రుగ‌నుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక, అంతర్రాష్ట్ర అంశాలపై సెప్టెంబర్‌ 1న ఢిల్లీలో కేంద్ర జల సంఘం (CWC) చైర్మన్‌ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సేవా భవన్‌లో జరిగే ఈ సమావేశంలో తెలంగాణ, మహారాష్ట్ర జలవనరుల శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారు.

తమ్మిడిహట్టి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం రేవంత్‌రెడ్డి మే 26న మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసి, రెండు రాష్ట్రాల మధ్య సమావేశం ఏర్పాటు చేసి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం సూచించాలని కోరారు. ఈ అంశాన్ని ప్రధానమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లగా, ప్రధానమంత్రి కార్యాలయం జలశక్తి మంత్రిత్వ శాఖకు పంపించింది. అనంతరం ఆగస్టు 5న కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్‌.పాటిల్‌కు సీఎం ప్రత్యేకంగా లేఖ రాసి కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. మహారాష్ట్ర గతంలో అంగీకరించిన 148 మీటర్ల ఎత్తుకు బదులుగా 152 మీటర్ల ఎత్తు ఉండేలా అంగీకారం సాధించేందుకు తెలంగాణ ప్రయత్నిస్తోంది. 148 మీటర్ల వద్ద అవసరమైన నీటిని గ్రావిటీ ద్వారా తీసుకోవడం సాధ్యం కాదని, భారీ పంపులు వినియోగిస్తే విద్యుత్‌ వ్యయం పెరుగుతుందని తెలంగాణ కేంద్రానికి వివరించింది.

తక్కువ విద్యుత్‌ వ్యయంతో, దీర్ఘకాలికంగా రాష్ట్రానికి ప్రయోజనం కలిగేలా ప్రాజెక్టును నిర్మించాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన వాదన. సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ అధ్యయనాల ప్రకారం జలమట్టం పెంపుతో అదనపు ముంపు పరిమితంగానే ఉంటుందని కూడా ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. వెనుకబడిన, కరవు ప్రభావిత ప్రాంతాలకు సాగునీరు అందించే ఈ కీలక ప్రాజెక్టును త్వరగా కార్యరూపంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కేంద్రం, మహారాష్ట్రతో వరుసగా సంప్రదింపులు జ‌రుపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *