(న్యూస్ఇన్, హైదరాబాద్)
ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకంలో ఇండ్ల కేటాయింపు లాటరీ ప్రక్రియ ఈ నెల 28 నుంచి 31 వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ప్రతి రోజూ నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు చొప్పున 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు రోజుల పాటు ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ విపి గౌతం తెలిపారు. ఈ లాటరీ ప్రక్రియనంతటినీ యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని, ఎటువంటి అనుమానాలు, అపోహలకు తావివ్వకుండా పూర్తి పారదర్శకంగా లాటరీ డ్రా తీసేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్థలాభావం భద్రతా ఏర్పాట్లు తదితర కారణాల వలన లాటరీ కేంద్రాల్లోకి దరఖాస్తు దారులందరినీ అనుమతించలేమని, అయితే, ఆయా కేంద్రాల వద్ద లాటరీ జరుగుతున్న తీరును ప్రజలందరూ స్క్రీన్లపై వీక్షంచేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. లాటరీ ప్రక్రియ ప్రత్యక్ష ప్రసారాన్ని tghb.telangana.gov.in వెబ్ సైట్ లోనూ హౌసింగ్ డిపార్ట్ మెంట్ సోషల్ మీడియా హ్యాండిల్స్ tghd.official తో ఉన్న ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ ల ద్వారా చూడవచ్చని ఆయన వివరించారు. ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ పథకం కింద ఇండ్లు కావాలనుకునే వారి నుంచి ఈ నెల 15 వరకు దరఖాస్తులను స్వీకరించిన సంగతి తెలిసిందే. వచ్చిన దరఖాస్తులన్నిటినీ పరిశీలించడమే కాకుండా, అనర్హులుగా గుర్తించిన వారి నుంచి అభ్యంతరాలను కూడా తీసుకుని పరిష్కరించినట్లుగా వైస్ ఛైర్మన్ వి పి గౌతం తెలిపారు.
ఆగస్తు 28 వ తేదీ…….
కుత్భుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం గండిమైసమ్మ ఫంక్షన్ హాల్ లోనూ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోయినపల్లి లోని మల్లారెడ్డి గార్డెన్స్ లో, రాజేంద్రనగర్ మైలార్ దేవులపల్లి కు చెందిన లాటరీని లక్ష్మీగుడ పొదుపు సంఘం హాల్ లోనూ , నాంపల్లి నియోజకవర్గం రెడ్ హిల్స్ లోని వెట్స్ గార్డెన్ లో నిర్వహిస్తారు.
ఆగస్టు 29 వ తేదీ…
ఖైరతాబాద్ ఎంఎల్యే కాలనీకి సంబంధించిన లాటరీని కుమంరభీం ఆదివాసీ భవన్ సేవాలాల్ బంజారా భవన్ లో నూ, కూకటపల్లి నియోజకవర్గం కెపిహెచ్ బి కమ్యూనిటీ హాల్ లోనూ, అంబర్ పేట నియోజకవర్గం లాటరీని మహరాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్ లోనూ, బహదూర్ పుర నియోజకవర్గం లోని ఎస్ డి ఆర్ పెర్ల్ ప్యాలెస్ లో నిర్వహిస్తారు.
30 వ తేదీ…..
శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని రాయదుర్గం ప్రాజెక్టు లాటరీ ని గచ్చిబౌలిలోని నిర్మిత కేంద్ర ప్రాంగణంలోనూ, మలక్ పేట నియోజకవర్గానికి చెందిన లాటరీని చంపాపేటలోని సాదియా ఫంక్షన్ హాల్ లో నూ, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లాటరీని బండ్లగూడ రాజీవ్ స్వగృహ కమ్యూనిటీ హాల్ లోనూ, మేడ్చల్ నియోజకవర్గం లాటరీని పోచారం స్వగృహ కమ్యూనిటీ హాల్ లో నిర్వహిస్తారు.
31 వ తేదీ….
మల్కాజిగిరి కౌకూర్ ప్రాజెక్టు లాటరీ ప్రక్రియను ఆల్వాల్ విబిఆర్ గార్డెన్స్ లోనూ, సనత్ నగర్ పాటిగడ్డ లాటరీని హెవన్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ లోనూ, మహేశ్వరం జల్ పల్లి ప్రాజెక్టు లాటరీనీ బడంగ్ పేట్ ప్రజా భవన్ లోనూ, కార్వాన్ కుల్సుంపుర ప్రాజెక్టు లాటరీని నిర్వహిస్తారు.

దళారీలకు ఆస్కారం లేదు…..
ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకంలో సిఫారసులు, మధ్యవర్తుల ప్రమేయం అనేది ఉండదని పూర్తి పారదర్శకంగా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు లోబడే ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియ జరుగుతుందని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ స్పష్టం చేశారు ఈ పథకంలో లాటరీలో ఇండ్లు రాకున్నా ఇండ్లు ఇప్పిస్తామంటూ కొంత మంది మధ్యవర్తులు చెపుతున్నారని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి ఆధార రహితమైన ప్రచారాలను నమ్మవద్దనీ, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు కోసం ఎవరనీ ఆశ్రయించవద్దని ఆయన సూచించారు.
ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకంలో అన్ని అర్హతలున్నప్పటికీ లాటరీ లో తమ పేరు రాకున్నా దరఖాస్తుదారులు దిగులు పడవద్దనీ, తదుపరి విడతలో నిర్మించే టవర్స్ అర్హులుగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుతం చేపడుతున్నవి పైలట్ ప్రాజెక్టు మాత్రమే అని, మొత్తం లక్ష ఇండ్లను నిర్మిస్తామని ఆయన తెలిపారు. అనర్హులైన దరఖాస్తు దారులు కూడా, ప్రభుత్వం త్వరలో ప్రకటించే ఎంఐజి హౌసింగ్ పథకంలో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు. ప్రభుత్వం అన్ని వర్గాల వారికి సొంత ఇండ్లు కల్పించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నదని పేర్కొన్నారు.












Leave a Reply