(న్యూస్ఇన్,హైదరాబాద్)
మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ మళ్లీ తెరపైకి వస్తోంది. కొండా సురేఖపై పార్టీ హై కమాండ్ చర్యలు తీసుకుంటే అమె స్తానాన్ని భర్తీ చేయాల్సి ఉంటుంది. తెలంగాణాలో బలమైన సామాజిక వర్గాల ప్రతినిధిగా కొండా సురేఖకు గుర్తింపు ఉంది. అదే సామాజిక వర్గానికి చెందిన మహిళా నేతలకు అవకాశం కల్పిస్తారా… లేదంటే బీసీ మహిళకు అవకాశం దక్కుతుందా లేదంటే అదే జిల్లాకు చెందిన మరో మహిళకు పార్టీ అవకాశం కల్పిస్తుందా అన్నది ఆసక్తి రేపుతోంది. కొండా సురేఖపై చర్యలు తప్పవన్న సంకేతాలు స్థానిక కాంగ్రెస్ నేతలు ఇస్తున్నారు. కొండా సుష్మిత తాజా వ్యాఖ్యలతో పాటు గతంలో వివాదాలకు దారి తీసిన పలు అంశాలను కూడా నివేదిక రూపంలో పార్టీ హై కమాండ్ కు పార్టీ క్రమశిక్షణా కమిటీ పంపించింది. హైకమాండ్ దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే రాష్ట్ర పార్టీ నేతలు హై కమాండ్ పై వత్తిడి పెంచి వీలైనంత త్వరగానే కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తప్పించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.
ఎవరిపై సీఎం అసంతృప్తి……
రెండు స్థానాలు భర్తీ చేయాల్సిన పరిస్థితుల్లో కొండా సురేఖను క్యాబినెట్ నుంచి మూడు స్థానాలను భర్తీ చేయాల్సి ఉంటుంది. అయితే మంత్రులుగా కొనసాగుతున్న ఒక్కరిద్దరు మంత్రుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వారిని కూడా తొలగించి ఐదు లేదా అరుగు కొత్త మంత్రులతో ఎన్నికల టీం ను సిద్ధం చేసుకునే పనిలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు గాంధీ భవన్ లో చర్చ జరుగుతోంది. సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని మంత్రి వర్గం కూర్పు ఉంటుందని తెలుస్తోంది. గిరిజన లంబాడాలకు మంత్రి వర్గంలో స్థానం లేదు…..ఆ సామాజిక వర్గం నేతను సంతృప్తి పరిచేందుకు ఒకరికి డిప్యూటీ స్పీకర్ గా అవకాశం కల్పించడంతో మరొకరికి మంత్రి వర్గంలో స్థానం కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాంచందర్ నాయక్, బాలునాయక్ లలో ఒకరికి మంత్రి పదవి దక్కే చాన్స్ ఉంది.


ఆశావహులు ఎక్కువే…..
ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి కొమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికలకు ముందు తనకు హామీ ఇచ్చి బీజేపీ నుంచి కాంగ్రెస్ లో పార్టీలో చేర్చుకున్నారన్న వాదన తెరపైకి తెస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మంత్రి వర్గంలోకి తనను తీసుకోవాలని గళం వినిపిస్తున్నారు. పార్టీ తీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు ఇప్పటి వరకు మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. జిల్లాకు చెందిన సీనియర్ నేతను క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం కూడా ఉంది. అయితే సామాజిక సమీకరణల్లో భాగంగా ఒకే సామాజికవర్గానికి చెందిన వారికి అవకాశం ఇవ్వడం ఎంత వరకు సమంజసమన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. జిల్లాకు చెందిన సీనియర్ నేత సుదర్శన్ రెడ్డికి మంత్రిగా అవకాశం కల్పించకపోవడం సాధ్యం కాకపోవడంతో ప్రభుత్వ సలహాదారుగా అవకాశం కల్పించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమీప బంధువు కూడా కావడం సుదర్శన్ రెడ్డికి కొత్త చిక్కులు తెచ్చే పెట్టేలా కనిపిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేం సాగర్ రావ్ క్యాబినెట్లో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ మూడు జిల్లాల పరిధిలో ఒకరికే మంత్రి వర్గంలో చోటు దక్కడాన్ని ఆ ప్రాంత ప్రజా ప్రతినిధులు అంతర్గతంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు ఒకరికైనా క్యాబినెట్లో చోటు కల్పించాలన్న వాదనను తెరపైకి తెస్తున్నారు.
గద్వాల్ విజయలక్ష్మి ప్రయత్నాలు…
కొండా సురేఖను తప్పిస్తే ఆ స్థానంలో తన కూతురుకు అవకాశం ఇవ్వాలని సీనియర్ నేత కేకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పార్టీ హై కమాండ్ ముందు ఇప్పటి కే తన ప్రతిపాదనలు ఉంచినట్లు ప్రచారం జరుగుతోంఇ. కేకే పార్టీలో చేరిన తరువాత రాజ్యసభ స్థానాన్ని వదులు కోవడంతో కేకేకు ప్రభుత్వ సలహాదారుగా అవకాశం దక్కింది. హైదరాబాద్ మేయర్ గా ఉన్న గద్వాల్ విజయ లక్ష్మి పదవీ కాలం పూర్తి కావడంతో ఆ వెంటనే మహిళా కమిషన్ చైర్మన్ గా సీఎం అవకాశం కల్పించారు. మరోసారి గద్వాల్ విజయ లక్ష్మిని మంత్రి వర్గంలో చోటు కల్పించడం ఎంత వరకు సమంజసమన్న వాదన తెరపైకి వస్తోంది. అయితే ఈ ఏడాది చివరి నాటికి గ్రేటర్ ఎన్నికలు జరిపేందుకు సర్కార్ సిద్దం అవుతుండడంతో…. గ్రేటర్ లో పార్టీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.మరో రెండేళ్లలో ఎన్నికలు ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లో సీఎం మంత్రి వర్గంలోని ఒక్కరిద్దరిని తప్పించడంపై కూడా సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మంత్రి వర్గం నుంచి కొండా సురేఖ సహా మరొ ఇద్దరు లేదా ముగ్గురిని తొలగిస్తే…ఎన్నికల నాటికి పరిస్థితులు చక్కబడుతాయన్న అభిప్రాయంతో కూడా పలువురు నేతల్లో వ్యక్తం అవుతోంది.












Leave a Reply