(న్యూస్ఇన్,హైదరాబాద్)
లోతైన విశ్లేషణతోనే నేరాలను కట్టడి చేయవచ్చని డీజీపీ సీవీ ఆనంద్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నేరాల దర్యాప్తు, పోలీసింగ్లో వృత్తి నైపుణ్య ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని డీజీపీ సీవీ ఆనంద్ అధికారులను ఆదేశించారు. నేరాల సమీక్షను కేవలం గణాంకాలకే పరిమితం చేయకుండా.. ప్రతి నేరం వెనుక కారణాలు, నేరస్థుల విధానం, దర్యాప్తు తీరు, కేసుల పరిష్కారాన్ని లోతుగా విశ్లేషించాలని అన్ని యూనిట్ల పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో డీజీపీ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఇటీవలి కాలంలో సీసీటీఎన్ఎస్పై ప్రత్యేకంగా దృష్టి సారించడం మూలంగా గతంలో 70–80 శాతంగా ఉన్న సీసీటీఎన్ఎస్ డేటా అప్డేట్.. అధికారులు, సిబ్బంది సమష్టి కృషితో 96 శాతానికి చేరడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రతి నెల నిర్వహించే క్రైమ్ రివ్యూ సమావేశాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని డీజీపీ సూచించారు. క్షేత్రస్థాయిలో పోలీసులు పాటించాల్సిన ప్రాథమిక విధానాలను కచ్చితంగా అమలు చేయాలని, ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ను పాటించడాన్ని అధికారులు పోటీగా తీసుకోవాలని అన్నారు. అన్ని జోన్ల డీఐజీలు, మల్టీజోన్ ఐజీలు ఇకపై ఇన్స్పెక్షన్ నోట్స్ను పరిశీలించాలని ఆదేశించారు. జిల్లాల పర్యటనలు, పోలీస్స్టేషన్ల తనిఖీల సమయంలో గుర్తించే అంశాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. నేరాల ధోరణిని ముందుగానే గుర్తించి, అవసరమైన చోట ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు.
రాష్ట్రంలో 7.15% పెరిగన నేరాలు…
రాష్ట్రంలో మొత్తం నేరాల సంఖ్య మూడేళ్లలో 7.15 శాతం పెరిగింది. 2023-24లో 2,65,377 కేసులు నమోదుకాగా.. 2025-26లో 2,84,363కు చేరాయి. లక్ష జనాభాకు నేరాల రేటు 481.58 నుంచి 491.59కి పెరిగింది. మాదకద్రవ్యాల కేసులు 2023-24లో 2,026 ఉండగా.. 2025-26లో 2,960కు చేరాయి. మూడేళ్లలో 46.10 శాతం పెరుగుదల నమోదైంది. వ్యవస్థీకృత నేరాలు 25 నుంచి 451కు పెరిగి 1,704 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ట్రాఫిక్ నేరాలు 29,130 నుంచి 31,891కు పెరిగి 9.48 శాతం వృద్ధి చెందాయి. మరోవైపు సైబర్ నేరాలు 25,373 నుంచి 22,000కు తగ్గి 13.29 శాతం, ఆర్థిక నేరాలు 37,690 నుంచి 32,684కు తగ్గి 13.28 శాతం క్షీణించాయి.

తీవ్ర నేరాల్లో 10.33% తగ్గుదల…
తీవ్ర నేరాలు (గ్రేవ్ క్రైమ్) గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా తగ్గాయి. 2024-25లో 7,019 కేసులు నమోదుకాగా.. 2025-26లో 6,294కు తగ్గాయి. ఏడాది వ్యవధిలో 10.33 శాతం తగ్గుదల నమోదైంది. లక్ష జనాభాకు నేరాల రేటు 11.21 నుంచి 10.88కు తగ్గింది. ప్రధాన కమిషనరేట్లలో హైదరాబాద్లో 1,483 నుంచి 1,094కు తగ్గి 26.23 శాతం క్షీణత నమోదైంది. సైబరాబాద్లో 656 నుంచి 613కు, మల్కాజిగిరిలో 664 నుంచి 549కు తగ్గాయి. అయితే కొన్ని జిల్లాల్లో తీవ్ర నేరాలు పెరిగాయి. ములుగులో 44 నుంచి 88కు, నిర్మల్లో 66 నుంచి 102కు, ఆదిలాబాద్లో 96 నుంచి 140కు చేరాయి. చిన్న, గిరిజన జిల్లాల్లో పెరుగుతున్న తీవ్ర నేరాలపై ప్రత్యేక దృష్టి అవసరమని గణాంకాలు సూచిస్తున్నాయి.
మూడేళ్లలో 7.28% వృద్ధి..
తీవ్ర నేరాలు తగ్గుతున్నప్పటికీ సాధారణ నేరాలు (నాన్-గ్రేవ్) మాత్రం పెరుగుతున్నాయి. 2023-24లో 2,59,201గా ఉన్న కేసులు 2025-26లో 2,78,069కు చేరాయి. మూడేళ్లలో 7.28 శాతం పెరుగుదల నమోదైంది. కమిషనరేట్లలో ఫ్యూచర్ సిటీలో 23.70 శాతం, సైబరాబాద్లో 17.32 శాతం, మల్కాజిగిరిలో 13.53 శాతం పెరుగుదల నమోదైంది. హైదరాబాద్లో మాత్రం 2.77 శాతం తగ్గుదల కనిపించింది. జిల్లాల విషయానికి వస్తే కొమురం భీం ఆసిఫాబాద్లో 70.88 శాతం, ఆదిలాబాద్లో 60.71 శాతం పెరుగుదల నమోదైంది. మెదక్, సంగారెడ్డి, నల్గొండ, నారాయణపేట జిల్లాల్లోనూ సాధారణ నేరాలు పెరిగాయి.
మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా..
రాష్ట్రంలో నార్కోటిక్ కేసుల పెరుగుదల పోలీస్ శాఖకు ప్రధాన సవాలుగా మారుతోంది. 2023-24లో 2,026 కేసులు ఉండగా.. 2025-26లో 2,960కు చేరాయి. లక్ష జనాభాకు నేరాల రేటు 3.68 నుంచి 5.12కు పెరిగింది. కమిషనరేట్లలో సైబరాబాద్లో 266 నుంచి 508కు చేరి 90.98 శాతం పెరుగుదల నమోదైంది. వరంగల్లోనూ మూడేళ్లలో 142.31 శాతం పెరిగాయి. జిల్లాల్లో ఆదిలాబాద్లో 57 నుంచి 219కు కేసులు పెరిగాయి. నేరాల రేటు 7.22 నుంచి 26.91కు చేరింది. నిజామాబాద్లో 62 నుంచి 123కు పెరిగాయి. నారాయణపేట, మహబూబ్నగర్, జోగులాంబ గద్వాల జిల్లాల్లోనూ గణనీయమైన పెరుగుదల నమోదైంది. ఈ గణాంకల ప్రకారం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మూడేళ్లలో నార్కోటిక్ కేసులు 46.10% పెరుగుదల నమోదయింది.

మహిళలు, చిన్నారులపై తగ్గిన నేరాలు…
2024-25లో 31,593గా ఉన్న మహిళలు, చిన్నారులపై నేరాలు 2025-26లో 31,108కు తగ్గాయి. ఏడాదిలో 1.54 శాతం క్షీణత నమోదైంది. అయితే 2023-24తో పోలిస్తే 3.81 శాతం ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్ కమిషనరేట్లలో కేసులు తగ్గగా.. ఫ్యూచర్ సిటీలో 790 నుంచి 994కు పెరిగాయి. జిల్లాల్లో ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబాబాద్, నారాయణపేట, ములుగులో పెరుగుదల కనిపించింది.
ట్రాఫిక్ నేరాలు 9.48% పెరుగుదల…
రాష్ట్రంలో ట్రాఫిక్ నేరాలు కూడా వరుసగా పెరుగుతున్నాయి. 2023-24లో 29,130 కేసులు ఉండగా.. 2025-26లో 31,891కు చేరాయి. మూడేళ్లలో 9.48 శాతం పెరిగాయి. సైబరాబాద్లో 2,882 నుంచి 3,677కు, మల్కాజిగిరిలో 3,213 నుంచి 3,673కు కేసులు పెరిగాయి. హైదరాబాద్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. వరంగల్లో 8.27 శాతం తగ్గింది. జిల్లాల్లో కొమురం భీం ఆసిఫాబాద్లో 154 నుంచి 1,115కు చేరి 624.03 శాతం పెరుగుదల నమోదైంది. నిర్మల్లో 67.92 శాతం, నల్గొండలో 34.37 శాతం, ఆదిలాబాద్లో 28.30 శాతం పెరిగాయి. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, వికారాబాద్లో తగ్గుదల కనిపించింది.
సైబర్, ఆర్థిక నేరాల్లో ఊరట….
సైబర్ నేరాలు 2024-25తో పోలిస్తే 2025-26లో 13.29 శాతం తగ్గాయి. ఆర్థిక నేరాల్లోనూ 13.28 శాతం తగ్గుదల నమోదైంది. ఈ రెండు విభాగాల్లో మూడేళ్ల కాలానికీ తగ్గుదల కనిపించడం సానుకూల పరిణామంగా పోలీస్ శాఖ భావిస్తోంది. మొత్తంగా రాష్ట్ర నేరాల సరళిని పరిశీలిస్తే.. తీవ్ర నేరాలు, సైబర్, ఆర్థిక నేరాల్లో తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ మాదకద్రవ్యాలు, వ్యవస్థీకృత నేరాలు, సాధారణ నేరాలు, ట్రాఫిక్ నేరాల్లో పెరుగుదల నమోదైంది. ఈ నేపథ్యంలో నేరాలపై లోతైన విశ్లేషణ, నెలవారీ సమీక్షలు, క్షేత్రస్థాయి తనిఖీలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ సమీక్షా సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.











Leave a Reply