(న్యూస్ఇన్,హైదరాబాద్)
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు అధికారులు షాక్ ఇచ్చారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నగరంలో నిర్మాణం చేయాలని భావిస్తున్న ఇందిరమ్మ టవర్స్ లబ్ది దారుల ఎంపిక సందర్భంగా అధికారులు వ్యవహరించిన తీరు ఇప్పుడు హాట్ హాట్ గా మారింది. అధికారుల తీరుపై ఎమ్మెల్యే దానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో లక్ష ఇళ్ల నిర్మాణం చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టులో భాగంగా తొలి విడతలో దాదాపు 8 వేల ఇళ్లను నిర్మాణం చేయాలని సర్కార్ నిర్ణయించింది. కొన్ని రోజుల క్రితం ఇందుకు సంబంధించిన దరఖాస్తులను ఆన్ లైన్ లో స్వీకరించారు. 16 నియోజకవర్గాల్లో దాదాపు 8 వేల ఇళ్లను తొలి విడతలో సర్కార్ నిర్మాణం పనులను త్వరలో మొదలు పెట్టనుంది. ఇందుకోసం ఆయా నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున లబ్ది దారులు దరఖాస్తు చేసుకున్నారు.

ఒక్కో నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణం చేయనున్నారు. నియోజకవర్గాల వారిగా 28వ తేదీ నుంచి లాటరీ నిర్వహించి లబ్ది దారులను ఎంపిక చేస్తున్నారు. పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడంతో అందరి సమక్షంలోనే లాటరీ ద్వారా లబ్ది దారుల ఎంపిక కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు నియోజకవర్గాల్లో ఈ లాటరీలో పాల్గొంటున్నారు. స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ లాటరీ ప్రక్రియను పూర్తి చేసేందుకు సర్కార్ పలు సూచనలు చేసింది. ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి లబ్ది దారుల ఎంపిక ను ఆ నియోజక వర్గ పరిధిలోని బంజారా భవన్ లో నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధికారులు స్థానిక శాసనసభ్యుడైన దానం నాగేందర్ ను ఆహ్వనించారు. యధావిధిగా ఎమ్మెల్యే రావడం ఆలస్యం కావడంతో….అధికారులు లబ్ది దారుల ఎంపికను లాటరీ ద్వారా పూర్తి చేశారు. దీంతో ఎమ్మెల్యే అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించకుండా అధికారులు వ్యవహరించిన తీరును ఎండగట్టారు. అధికారులు ఇలా వ్యవహరించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.











Leave a Reply