(న్యూస్ఇన్,హైదరాబాద్)
హైదరాబాద్ అభివృద్ధి లో కొత్త దిశ కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ముసారం బాగ్ లో కొత్తగా నిర్మించిన బ్రిడ్జ్ ను సీఎం ప్రారంభించారు. అనంతరం జరిగిన అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో ఆయన హైదరాబాద్ అభివృద్ధి, మౌలిక వసతులు, ఉద్యోగాలు, రైతులు, మహిళా సంఘాలు, ప్రభుత్వ పాఠశాలలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న ‘క్యూర్, ప్యూర్, రేర్’ విధానాన్ని సీఎం తొలిసారిగా స్పష్టంగా వివరించారు. ‘క్యూర్’లో సర్వీస్ సెక్టార్, ‘ప్యూర్’లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, ‘రేర్’లో అగ్రికల్చర్ సెక్టార్ను అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు. హైదరాబాద్ను ఐటీ, సినిమా, విద్య, ఉద్యోగాలకు కేంద్రంగా మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

అంబర్పేట ప్రత్యేక ప్రస్తావన….
అంబర్పేట నియోజకవర్గం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని సీఎం పేర్కొన్నారు. మూసీ మురుగు, వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, గతంలో చిన్న వర్షానికే మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద వరద పరిస్థితులు ఏర్పడేవని అన్నారు. రెండేళ్లలో బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభించామని తెలిపారు.పేదలకు ఇళ్ల విషయంలో గత ప్రభుత్వంపై సీఎం విమర్శలు చేశారు. అంబర్పేటలో పది ఎకరాల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని, పేదలకు వారు నివసించే ప్రాంతాల్లోనే ఇళ్లు నిర్మించి ఇవ్వడం వల్లే అసలు ప్రయోజనం ఉంటుందని అన్నారు.బతుకమ్మ కుంట పునరుద్ధరణను కూడా సీఎం ప్రస్తావించారు. కుంటను ఆక్రమణల నుంచి కాపాడి పునరుద్ధరించామని, ఎండాకాలంలోనూ నీరు నిలిచేలా చేశామని తెలిపారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ విషయంలో హైడ్రాపై వస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ, ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేసేది ఎవరో ప్రజలు ఆలోచించాలని అన్నారు.
1000 రోజుల పాలనపై లెక్కలు…..

తమ ప్రభుత్వం 1000 రోజుల ప్రజా పాలన పూర్తి చేసుకుందని రేవంత్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని ఆరోపించిన ఆయన.. ప్రస్తుతం ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఐదో తేదీలోగా వేతనాలు ఇస్తున్నామని పేర్కొన్నారు.గత ప్రభుత్వం వదిలిన రూ.8 వేల కోట్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిల్లో రూ.6 వేల కోట్లను రెండు నెలల్లోనే విడుదల చేశామని సీఎం తెలిపారు. ఉద్యోగులు, వారి కుటుంబాలకు ఆరోగ్య భద్రత కార్డులను పునరుద్ధరించామని చెప్పారు.
72 వేల ఉద్యోగాల భర్తీ…..
తమ 1000 రోజుల పాలనలో 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని సీఎం ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని, లక్ష అడ్మిషన్లు అదనంగా వచ్చాయని తెలిపారు. 25 లక్షల మంది విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని చెప్పారు.ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నామని, స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీలను ఏర్పాటు చేశామని సీఎం వెల్లడించారు.












Leave a Reply