(న్యూస్ఇన్, నిజామాబాద్)
తెలంగాణకు ఇప్పుడు కావాల్సింది బంగారు తెలంగాణ కాదని, బహుజన తెలంగాణ అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల జీవితాల్లో ఆశించిన స్థాయిలో గుణాత్మక మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక న్యాయంతో అన్ని వర్గాలు అభివృద్ధి చెందే తెలంగాణ కోసం పనిచేస్తానని తెలిపారు. నిజామాబాద్లో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో కవిత ప్రసంగించారు. పార్టీ ఏర్పాటు చేసిన నాలుగు నెలల తర్వాత సొంతగడ్డపై సభకు హాజరైన ఆమె.. ప్రజలను చూసి భావోద్వేగానికి గురయ్యారు. గతంలో ఎంపీగా, ఎమ్మెల్సీగా తనను ఆశీర్వదించినట్లే ఇప్పుడు కూడా అండగా నిలవాలని నిజామాబాద్ ప్రజలను కోరారు.పదవుల కోసం తాను పార్టీ పెట్టలేదని, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలన్న సంకల్పంతోనే రాజకీయంగా ముందుకు వచ్చానని కవిత చెప్పారు. ఎలాంటి తప్పు చేయకపోయినా జైల్లో పెట్టారని, ఈడీ, సీబీఐ విచారణల సమయంలోనూ ధైర్యం కోల్పోలేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నుంచి బయటకు పంపించినా ప్రజల కోసం పనిచేయాలన్న నిర్ణయంతోనే కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేశానని తెలిపారు.
కాంగ్రెస్పై పోరాటం.. టీఆర్ఎస్ నిర్మాణం…..

ప్రజల జీవితాల్లో మార్పు కోసం ‘పాంచజన్యం’ పేరుతో ఐదు అంశాలను ముందుకు తీసుకెళ్తున్నామని కవిత చెప్పారు. ప్రతి కుటుంబానికి ఉచిత విద్య, వైద్యం అందించడమే తమ లక్ష్యమన్నారు. బహుజన తెలంగాణ అంటే అన్ని కులాలు, అన్ని వర్గాలు అభివృద్ధి చెందడమేనని స్పష్టం చేశారు.ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే మరోవైపు టీఆర్ఎస్ను క్షేత్రస్థాయిలో నిర్మిస్తామని తెలిపారు. వచ్చేఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో ఐదు స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని కవిత విమర్శించారు. మరోవైపు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ వైఫల్యాలను ప్రశ్నించడంలో విఫలమవుతోందని ఆరోపించారు. రెండు పార్టీల మధ్య అవగాహన ఉందని విమర్శించారు.
బీఆర్ఎస్పై తీవ్ర ఆరోపణలు….
బంగారు తెలంగాణ పేరుతో గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి జరిగిందని కవిత ఆరోపించారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తనపై వచ్చిన విమర్శలకు స్పందించిన ఆమె.. తనకు ఆ అవినీతిలో ఎలాంటి పాత్ర లేదన్నారు. కొందరు నేతల ఆస్తులు అధికారంలోకి రాకముందు, ఆ తర్వాత ఎలా పెరిగాయో ప్రజలు పరిశీలించాలని సూచించారు.నిజామాబాద్ జిల్లా నేత ప్రశాంత్ రెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు చేశారు. తనను తండ్రి కేసీఆర్కు దూరం చేసిన వ్యక్తి ఆయనేనని ఆరోపించారు. ప్రశాంత్ రెడ్డిని జీవితంలో క్షమించబోనని అన్నారు.

నిజామాబాద్ ప్రజలే నా ధైర్యం……
నిజామాబాద్ ప్రజలే తనకు ధైర్యమని కవిత చెప్పారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా ఈ ప్రాంత ప్రజలు ఇచ్చిన మద్దతుతోనే తాను ధైర్యంగా మాట్లాడగలిగానన్నారు. బీడీ కార్మికుల సమస్యలపై పోరాడి పెన్షన్ ఇప్పించానని, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ కోసం కూడా పోరాడినట్లు గుర్తు చేశారు.నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్పై కూడా కవిత విమర్శలు చేశారు. పసుపు బోర్డు వల్ల రైతులకు ఆశించిన ప్రయోజనం కలగలేదని ఆరోపించారు. కేంద్రం నుంచి నిజామాబాద్కు ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.తెలంగాణ కోసం, ముఖ్యంగా సామాజిక న్యాయం కోసం తమ పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు.












Leave a Reply