NewsInn

News in a Click

దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట- ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి

దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట- ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి

-మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

(న్యూస్ఇన్‌,హైద‌రాబాద్)

దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు, సీనియర్‌ సిటిజన్ల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు, వారికి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేలా సమగ్ర చర్యలు చేపట్టాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.దివ్యాంగుల పట్ల అధికారులు, సిబ్బంది మానవతా దృక్పథంతో ప్రేమ, ఆప్యాయతతో వ్యవహరించాలని సూచించారు. సంక్షేమ పథకాల అమలుతో పాటు విద్య, ఉపాధి, ఆర్థిక స్వావలంబనకు దోహదపడేలా కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు. సచివాలయంలో సోమవారం పీడబ్ల్యూడీ, ట్రాన్స్‌జెండర్‌, సీనియర్‌ సిటిజన్స్‌ శాఖలపై మంత్రి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శాఖల వారీగా అమలవుతున్న కార్యక్రమాలు, సంస్థల నిర్వహణ, మౌలిక వసతులు, లబ్ధిదారులకు అందుతున్న సేవలపై మంత్రి సమీక్షించారు.

మౌలిక వసతులు మెరుగుపరచాలి….

దివ్యాంగుల పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, మరుగుదొడ్లు తదితర మౌలిక వసతులను మెరుగుపరచాలని మంత్రి ఆదేశించారు.ప్రస్తుత వర్షాకాలం, రానున్న చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. అవసరమైన చోట వేడి నీటి సౌకర్యాన్ని కల్పించాలని ఆదేశించారు.విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, సంరక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం ఉండకూడదని మంత్రి స్పష్టం చేశారు.

ప్రభుత్వ భవనాలకు తరలించాలి….

దివ్యాంగుల పాఠశాలలు, సంస్థల్లో ఎన్ని ప్రభుత్వ భవనాల్లో, ఎన్ని ప్రైవేటు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయో వివరాలను సేకరించాలని మంత్రి ఆదేశించారు.ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న సంస్థలను గుర్తించి, సంబంధిత జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని ప్రభుత్వ భవనాలకు తరలించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.

దివ్యాంగ విద్యార్థులకు డిజిటల్‌ లైబ్రరీ

ఉన్నత విద్యను అభ్యసిస్తున్న, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న దివ్యాంగ విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా డిజిటల్‌ లైబ్రరీ, ఆధునిక సాంకేతిక సదుపాయాలు, కోచింగ్‌ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి సూచించారు.ఇందుకు అవసరమైన సమగ్ర ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

దివ్యాంగులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కొత్త ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను గుర్తించి కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలను పొందేందుకు సంబంధిత ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.

దివ్యాంగులకు గతంలో అందించిన వాహనాల వినియోగంపై మంత్రి సమీక్షించారు. జిల్లాల వారీగా ఇంకా అవసరమైన ఎలక్ట్రిక్‌ వాహనాల వివరాలను సేకరించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

‘నశా ముక్త్‌ భారత్‌ అభియాన్‌’పై సమీక్ష….

‘నశా ముక్త్‌ భారత్‌ అభియాన్‌’ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న తీరుపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా అందుతున్న ప్రయోజనాలు మరింత మందికి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ట్రాన్స్‌జెండర్లకు భరోసా….

ట్రాన్స్‌జెండర్లు ఎదుర్కొంటున్న వైద్యపరమైన సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి ఆదేశించారు. వారికి అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్సలు, ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.అర్హులైన ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు కార్డులు జారీ చేయాలని ఆదేశించారు.ఇప్పటికే పోలీసు, మెట్రో తదితర విభాగాల్లో ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. వారి విద్యార్హతలు, నైపుణ్యాలకు అనుగుణంగా ఇతర ప్రభుత్వ శాఖల్లోనూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలను గుర్తించాలని సూచించారు.

సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని వారికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ అందించడంతో పాటు, ఆర్థికంగా స్వావలంబన సాధించే దిశగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు, సీనియర్‌ సిటిజన్లకు సంబంధించిన శాఖాపరమైన సమస్యలు, పెండింగ్‌ అంశాలను గుర్తించి తన దృష్టికి తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు.దివ్యాంగులకు సంబంధించిన ప్రతి పథకం, కార్యక్రమం ద్వారా లబ్ధిదారులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరేలా అధికారులు పనిచేయాలని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *