(న్యూస్ఇన్, హైదరాబాద్)
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి బీఆర్ఎస్ శ్రీకారం చుట్టనుంది. అసెంబ్లీ సమావేశాల అనంతరం కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా లక్షలాది మందితో ప్రత్యక్ష ఉద్యమం చేపట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఎర్రవల్లిలో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మాజీ మంత్రి హరీశ్రావు వెల్లడించారు.
అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై విస్తృత చర్చకు కనీసం నెల రోజుల పాటు సభ నిర్వహించాలని బీఏసీలో డిమాండ్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ ఎత్తిపోతలు చేపట్టకుండా ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో 80 శాతం పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.

విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, రైతు సమస్యలు, విద్యుత్ కోతలు, రుణమాఫీ, 22ఏ భూములు, ఉద్యోగుల పీఆర్సీ, డీఏలు తదితర అంశాలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని హరీశ్రావు తెలిపారు. 30 లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై అవసరమైతే సభను స్తంభింపజేస్తామని స్పష్టం చేశారు.
కేసీఆర్ ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలన్న కాంగ్రెస్ డిమాండ్ను హరీశ్రావు తిప్పికొట్టారు. ఆరు గ్యారెంటీలు, రుణమాఫీ హామీల అమలుపై ముందుగా సీఎం రేవంత్రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో సీఎం మాట్లాడుతున్న భాష పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఉద్యమానికి నాయకత్వం వహిస్తారని ప్రకటించారు.












Leave a Reply