(న్యూస్ఇన్,హైదరాబాద్)
అసెంబ్లీ సమావేశాల పై స్పీకర్, మండలి చైర్మన్ లు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
శాసనసభ, శాసన మండలి వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో వసతులు, భద్రతా ఏర్పాట్లపై శాసనసభ, పోలీసు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, కౌన్సిల్ చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ మాట్లాడుతూ.. గత సమావేశాల మాదిరిగానే ఈసారి కూడా సభా కార్యక్రమాలు సజావుగా జరిగేందుకు ప్రభుత్వం, అధికారులు పూర్తి సహకారం అందించాలని కోరారు. సభ్యులు కోరిన సమాచారాన్ని వీలైనంత త్వరగా అందించాలని సూచించారు.

శాఖల వారీగా చర్చ జరిగే సమయంలో సంబంధిత అధికారులు అందుబాటులో ఉండి మంత్రులు, సభ్యులకు అవసరమైన సమాచారాన్ని అందించాలని స్పీకర్ సూచించారు. సభ లోపల, వెలుపల ప్రశాంత వాతావరణం ఉండేలా పోలీసు శాఖ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు.
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశం ఉన్నందున పోలీసు, ఇంటెలిజెన్స్ విభాగాలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ధర్నాలు, రాస్తారోకోలు వంటి కార్యక్రమాల వల్ల సభా కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు.
శాసన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ.. స్పీకర్, చైర్మన్ సూచనలను ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తుందని తెలిపారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలను ఒకరోజు ముందుగానే అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఉభయ సభల సమావేశాల సమయంలో ప్రతి శాఖ నుంచి ఒక అధికారి అందుబాటులో ఉంటారని, ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందన్నారు.












Leave a Reply