(న్యూస్ఇన్, హైదరాబాద్)
తెలంగాణలో భూభారతి, 22ఏ నిషేధిత జాబితా అంశం రాజకీయ వేడిని పెంచుతోంది. రైతులు, మధ్యతరగతి ప్రజల భూములను 22ఏ జాబితాలో చేర్చడాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద భూభారతి-22ఏ మహాధర్నా నిర్వహించింది. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాంచందర్రావు మాట్లాడుతూ.. భూభారతి, 22ఏ పేరుతో ప్రభుత్వం ప్రజలను, ముఖ్యంగా రైతులు, మధ్యతరగతి కుటుంబాలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి వ్యవస్థలో అవకతవకలకు పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపించిందని, వాటిని సరిచేసేందుకు భూభారతి తీసుకొస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు మరింత సమస్యలు సృష్టిస్తోందని విమర్శించారు.

22ఏ జాబితాలో ప్రైవేట్ పట్టా భూములను కూడా చేర్చడం, వివాదం ఉన్న సర్వే నంబర్లోని మొత్తం భూమిని నిషేధిత జాబితాలో పెట్టడం సరికాదన్నారు. ఈ వ్యవహారాలపై సమగ్ర విచారణకు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.22ఏ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 లక్షల మంది తమ భూములను విక్రయించుకోలేక, అవసరాలకు బ్యాంకు రుణాలు పొందలేక ఇబ్బందులు పడుతున్నారని రాంచందర్రావు పేర్కొన్నారు. సొంత భూమిపై హక్కు రాజ్యాంగబద్ధమైన హక్కు అని, దానిని ప్రభుత్వం కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు.అలాగే, రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. రైతులు తమ సమస్యలను చెప్పుకునేందుకు అధికారులను కలవడం కూడా కష్టంగా మారిందని అన్నారు. 22ఏ జాబితాలో చేర్చిన అర్హత ఉన్న భూములను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు.
శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. తమ పార్టీ నిర్వహించాలనుకున్న దీక్షకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు. అయితే అధికార పార్టీ అదే ప్రాంతంలో కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, ఉద్యోగాలు, ఫీజు రీయింబర్స్మెంట్, అవినీతి ఆరోపణలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.22ఏ భూముల సమస్య పరిష్కారం కాకపోతే ‘సడక్ నుంచి సదన్ వరకు’ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని బీజేపీ నేతలు హెచ్చరించారు.












Leave a Reply