(న్యూస్ఇన్,హైదరాబాద్)
సాగునీటి ప్రాజెక్టుల అంశంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర రైతులకు నీటి సమస్యలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రాజెక్టుల పరిస్థితిని ప్రజలకు వివరించేందుకు త్వరలో పాదయాత్ర చేపడతానని వెల్లడించారు. బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో పార్టీ నేతలతో ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు.

కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలతో పాటు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై బీఆర్ఎస్ తన వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సాగునీటి కోసం చేపట్టే ఉద్యమంలో భారీ సంఖ్యలో రైతులను భాగస్వామ్యం చేయాలన్నారు. లక్ష మంది రైతులతో కలిసి కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులను సందర్శిస్తానని కేసీఆర్ పేర్కొన్నారు. నీటి వనరులు, సాగునీటి ప్రాజెక్టుల ప్రాధాన్యతను రైతులకు వివరించడంతో పాటు ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిని ప్రజల దృష్టికి తీసుకెళ్లేలా కార్యక్రమాన్ని రూపొందింస్తున్నట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో సాగునీటి రంగానికి సంబంధించిన అంశాలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న నేపథ్యంలో కేసీఆర్ ప్రకటన తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఈ నేపథ్యంలో రైతులతో కలిసి ప్రాజెక్టులను సందర్శించాలన్న కేసీఆర్ నిర్ణయం బీఆర్ఎస్ రాజకీయ కార్యాచరణలో కీలకంగా మారనుంది. పాదయాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఏ ప్రాంతాల మీదుగా కొనసాగుతుంది, కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను పార్టీ త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ చేసిన ప్రకటనతో సాగునీటి ప్రాజెక్టుల విషయం రాజకీయాల్లో మరోసారి హాట్ హాట్ చర్చకు దారి తీయనున్నాయి.












Leave a Reply