NewsInn

News in a Click

హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్

హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్

(న్యూస్ ఇన్,హైదరాబాద్)

హైదరాబాద్‌కు మరో భారీ ప్రాజెక్టు రానుంది. దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు టీసీఎస్ అనుబంధ సంస్థ హైపర్ వాల్ట్ ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి హైపర్ వాల్ట్ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. టీసీఎస్ ప్రతినిధుల బృందం సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డిని కలిసి ప్రాజెక్టు వివరాలను వెల్లడించింది.

హైదరాబాద్‌లో 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 1 గిగావాట్ (1,000 మెగావాట్ల) సామర్థ్యంతో అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నారు. హైపర్ వాల్ట్‌తో పాటు భాగస్వామ్య సంస్థలు ఈ ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ కోసం దాదాపు రూ.70 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 7 వేల ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది

.

ప్రపంచంలోని ప్రముఖ ఏఐ కంపెనీలు, హైపర్‌స్కేలర్లు, గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్‌కు అవసరమైన భారీ కంప్యూటింగ్ మౌలిక వసతులను ఈ క్యాంపస్ అందించనుంది. అధిక సామర్థ్యమున్న కంప్యూటింగ్ వ్యవస్థలతో పాటు లిక్విడ్ కూలింగ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇందులో వినియోగించనున్నారు. దీంతో దేశంలో అత్యాధునిక, భారీ స్థాయి ఏఐ మౌలిక వసతుల కేంద్రాల్లో ఇది ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు తెలంగాణకే కాకుండా దేశానికి కూడా చారిత్రాత్మకమని అన్నారు. ఏఐ విప్లవంలో హైదరాబాద్ ప్రపంచస్థాయి నగరంగా ఎదుగుతోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఏఐ మోడల్స్, కంప్యూటింగ్ సామర్థ్యం కీలక ప్రజా మౌలిక వసతులుగా మారనున్న నేపథ్యంలో, ఆ సామర్థ్యం తెలంగాణలోనే అందుబాటులోకి రావడం రాష్ట్రానికి గణనీయమైన ప్రయోజనమని చెప్పారు.

టీసీఎస్ తెలంగాణలో భారీ పెట్టుబడులకు ముందుకు రావడాన్ని సీఎం స్వాగతించారు. ప్రభుత్వపరంగా అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుతో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి బలమైన పునాది పడుతుందని రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్-2047లో భాగంగా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకునే దిశగా ఈ ప్రాజెక్టు కీలక ముందడుగు అని అభివర్ణించారు.

రూ.70 వేల కోట్ల పెట్టుబడితో ఏఐ, డేటా సెంటర్లతో పాటు విద్యుత్, కూలింగ్, నెట్‌వర్కింగ్, నిర్మాణం, ఇంజినీరింగ్, ఆపరేషన్స్ వంటి అనుబంధ రంగాల్లోనూ కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ గ్రీన్ ఎనర్జీ, వాటర్-న్యూట్రల్ డిజైన్‌తో క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నారు.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలకు 2026 జనవరిలో దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ మధ్య జరిగిన సమావేశం నాంది పలికింది. అనంతరం తెలంగాణ ప్రభుత్వం, టీసీఎస్ ప్రతినిధుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. కొద్ది నెలల్లోనే ప్రాజెక్టుకు సంబంధించిన అవగాహన ఒప్పందం కుదరడంతో హైదరాబాద్‌లో భారీ స్థాయి ఏఐ మౌలిక వసతుల ఏర్పాటుకు మార్గం సుగమమైంది.SEO వివరాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *