NewsInn

News in a Click

తొలిరోజే వేడి పుట్టించిన తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు

తొలిరోజే వేడి పుట్టించిన తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు

(న్యూస్ఇన్‌,హైద‌రాబాద్)

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజే వేడి రాజుకుంది. అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీ సభ్యుల నిరసనలు, ఆందోళనలతో అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం అయ్యాయి. కాంగ్రెస్ హామీల‌ను అమ‌లు చేయ‌డం లేద‌ని ఆరోపిస్తే బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీషర్టులు ధరించి అసెంబ్లీకి చేరుకునే య‌త్నం చేశారు. నిర‌స‌న తెలుపుతూ వ‌చ్చిన బీఆర్ ఎస్ నేత‌ల‌ను పోలీసులు అనుమతించకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కేటీఆర్‌, హరీశ్‌రావు సహా పలువురు బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని తెలంగాణా భ‌వ‌న్ కు త‌ర‌లించారు. ఈ తోపులాట‌లో ప‌లువురు బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల‌కు గాయ‌ల‌య్యాయి. మాజీ హోంమంతి స‌బితా రెడ్డి, మ‌రో మాజీ మంత్రి సునితా ల‌క్ష్మారెడ్డి తో పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరు వివాదంగా మారింది.

తాతా మ‌ధు మండ‌లి స‌భ్య‌త్వం ర‌ద్దు…?

ఈ స‌మ‌యంలో ఎమ్మెల్సీ తాతా మ‌ధు చేసిన వ్యాఖ్య‌లు దూమారం రేపుతున్నాయి. మ‌ధు వ్యాఖ్య‌ల‌తో బీఆర్ ఎస్ కు వార్నింగ్ ఇచ్చేలా అధికార పార్టీ పావులు క‌దిపింది. ఎమ్మెల్సీ తాతా మ‌ధు స్పీక‌ర్ ప్ర‌సాద్ కుమార్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని అధికార పార్టీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఉభ‌య స‌భ‌ల అధికార పార్టీ స‌భ్యులు తాతా మ‌ధును ప‌ద‌వి నుంచి డిస్మిస్ చేయాల‌ని డిమాండ్ చేశారు. స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ కూడా మ‌ధు వ్యాఖ్య‌ల‌పై స్పీక‌ర్ స్థానంలో ఉన్నా…కంట త‌డి పెట్టారు. అయితే బీఆర్ ఎస్ ఈ వ్యాఖ్య‌ల‌ను త‌ప్పు బ‌డుతోంది. స్పీక‌ర్ ను ఉద్దేశించి త‌మ స‌భ్యుడు ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేద‌ని, చేసిన‌ట్లు మీరు భావిస్తే విచారం వ్య‌క్తం చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. కానీ…. అధికార పార్టీ ఉభ‌య స‌భ‌ల్లో వ్య‌వ‌హ‌రించిన తీరును ప‌రిశీలిస్తే ఎమ్మెల్సీ పై వేటు వేసి గులాబీ పార్టీని డిఫెన్స్ లోకి నెట్టాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అంది వ‌చ్చిన అవ‌కాశాన్ని వ‌దులుకోర‌ద‌న్న ఆలోచ‌నలో కాంగ్రెస్ పార్టీ ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌ధు మండ‌లి స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేసే విధంగా అధికార పార్టీ పావులు క‌దుపుతోంది.

నిషేధిత భూముల వివాదం….?

మరోవైపు అసెంబ్లీలో 22ఏ నిషేధిత భూముల అంశం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించాలని బీజేపీ సభ్యులు డిమాండ్‌ చేస్తూ సభలో ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేయడంతో సభలో కొంతసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని శాసనసభ వ్యవహారాల మంత్రి డి. శ్రీధర్‌బాబు స్పష్టం చేసినప్పటికీ బీజేపీ సభ్యులు తమ ఆందోళన కొనసాగించారు. దీంతో స్పీకర్‌ సభను కొద్దిసేపు వాయిదా వేశారు.

మొత్తంగా తొలి రోజే అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది. 1,000 రోజుల కాంగ్రెస్‌ పాలన, హామీల అమలు, 22ఏ భూములు, కాళేశ్వరం తదితర అంశాలపై రానున్న రోజుల్లో అసెంబ్లీ వేదికగా తీవ్ర చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరింత వాడివేడిగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి.

ఈ వారం అసెంబ్లీ స‌మావేశాలు….

అసెంబ్లీ స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌పై జ‌రిగిన బీఏసీ స‌మావేశం ఈ వారం అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. బీఏసీ స‌మావేశాన్ని బీఆర్ ఎస్ బ‌హిష్క‌రించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *