NewsInn

News in a Click

కాంట్రాక్టులు, క‌మీష‌న్లు కాంగ్రెస్ లో పంచాయ‌తీ

కాంగ్రెస్ దోపిడికి నైనీ బ్లాక్ టెండ‌ర్ నిద‌ర్శ‌నం

రాంచంద‌ర్ రావ్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

సింగ‌రేణి సంస్థ లో జ‌రుగుతున్న బొగ్గు టెండ‌ర్ల వ్య‌వ‌హారం కాంగ్రెస్ పార్టీ క‌మిష‌న్ల కోసమే జ‌రుగుతున్న పంచాయ‌తీగా బీజెపి రాష్ట్ర అధ్య‌క్షులు రాంచంద‌ర్ రావ్ అన్నారు. నైనీ బ్లాక్ టెండ‌ర్ల‌లో క‌మీష‌న్లు, కాంట్రాక్ట‌ర్లు పేరుతో కాంగ్రెస్ దోపిడికి పాల‌న‌గా నిద‌ర్శ‌నంగా నిలుస్తుంద‌న్నారు. కాంగ్రెస్ పాలనలో టెండర్లు అభివృద్ధి కోసం కాకుండా కేవలం కమీషన్ల కోసమే జరుగుతున్నాయన్న నిజం బయటపడిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల సమస్యలపై కాదు, కేవలం కమీషన్ల గురించే ఆలోచన. సింగరేణి కార్మికుల రక్తం, చెమట పీల్చి కాంగ్రెస్ నాయకులు కమీషన్లు దండుకుంటున్నారు.

కాంగ్రెస్ నాయకుల సొంత మనుషులు, బంధుమిత్రులకే కోల్ బ్లాక్స్, కాంట్రాక్టులు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీకి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాసే నైతిక హక్కు లేద‌న్నారు. సింగరేణిలో జరిగిన కుంభకోణాల్లో సగం పాపం గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వానిదైతే, మిగతా సగం పాపం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానిదని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో కూడా సింగరేణి కాంట్రాక్టులు తమ సొంత మనుషులకే ఇచ్చిన విషయం ప్రజలకు తెలిసిందన్నారు.దేశంలోనే అత్యంత లాభాల్లో ఉన్న సంస్థగా గుర్తింపు పొందిన సింగరేణిని ఈరోజు నష్టాల్లో ఉందని చెప్పడం దారుణం. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి రూ.50 వేల కోట్లకు పైగా బకాయిపడి ఉందన్నారు.నష్టాల్లో ఉందని చెబుతున్న సింగరేణి నుంచి మెస్సీ తెలంగాణకు వచ్చిన సందర్భంలో రూ.10 కోట్ల స్పాన్సర్‌షిప్ ఎలా ఇచ్చారు? లాస్‌లో ఉన్న సంస్థతో ఇంత భారీ ఖర్చులు ఎలా పెట్టారు? దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. సైట్ విజిట్’ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చి, ఆ విధానం పేరుతో అక్కడికి వెళ్లి తమకు సంబంధించిన వారికే టెండర్లు ఇవ్వాలనే కుట్రపూరిత నిర్ణయాలు తీసుకుంటోందని, ఇది పూర్తిగా ప్లాన్డ్ స్కామ్ అని రాంచంద‌ర్ రావ్ ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల మధ్య జరుగుతున్న గొడవలు, కమిషన్ల పంచాయతీలు రోజు రోజుకు బయటపడుతూ, పాలన ఎంత దారుణంగా మారిందో స్పష్టంగా తెలుస్తోంద‌న్నారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, కోల్ స్కామ్ – ఇవన్నీ సెలెక్టివ్‌ అంశాల్లో మాత్రమే కాకుండా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలి. లక్షల కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తంపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *