NewsInn

News in a Click

విండ్ టర్బైన్ బ్లేడ్ యూనిట్ ఏర్పాటు చేయండి

దావోస్ లో మంత్రి లోకేష్

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌)

దావోస్ (స్విట్జర్లాండ్): డెన్మార్మ్ కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత విండ్ ఎనర్జీ సంస్థ వెస్టాస్ (VESTAS) గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోర్టెన్ హోయ్ డైర్హోమ్ తో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణపట్నం పోర్టు సమీపంలోని క్రిస్ సిటీ లేదా ఇఫ్కో సెజ్, కాకినాడ పోర్టు సమీపంలోని కేఎస్ఈజడ్ లో భారీ విండ్ టర్బైన్ బ్లేడ్, నాసెల్లె యూనిట్ల ఆఫ్ షోర్ మ్యానుఫ్యాక్చరింగ్ ను ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించండి. నెల్లూరు సమీపంలో ఇప్పటికే సీమెన్స్ గమేశా టర్బైన్ బ్లేడ్ ఫ్యాక్టరీని ప్రారంభించింది. వెస్టాస్ సంస్థ ఏపీలో తమ యూనిట్ నెలకొల్పినట్లయితే అవసరమైన అనుబంధ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాల సహాయ, సహకారాలు అందిస్తుంది. పవన విద్యుత్ రంగ నైపుణ్య, వృత్తిపరమైన ఆవసరాలను తీర్చడానికి ఆంధ్రా యూనివర్సిటీ లేదా తిరుపతి ఐఐటీలో సెంటర్ ఫర్ విండ్ ఎనర్జీ ఏర్పాటులో భాగస్వామ్యం వహించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. వెస్టాస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోర్టెన్ హోయ్ డైర్హోమ్ స్పందిస్తూ…. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు. వెస్టాస్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 88కి పైగా దేశాల్లో 197 గిగావాట్ల విండ్ ఎనర్జీ ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. యూరప్, అమెరికా, ఆసియా – పసిఫిక్, ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో వెస్టాస్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ, సర్వీస్ హబ్ లను ఏర్పాటుచేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *