NewsInn

News in a Click

త్వ‌ర‌లో కేసిఆర్ కు సిట్ నోటీసులు..?

ముగిసిన సంతోష్ రావ్ సిట్ విచార‌ణ‌

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

ఫోన్ ట్యాపింగ్ కేసులో దూకుడు పెంచిన అధికారులు రోజుకో నేత‌ను విచారిస్తున్నారు. గ‌త నాలుగైదు రోజులుగా బీఆర్ ఎస్ నేత‌ల‌ను వ‌రుస‌గా విచార‌ణ కోసం సిట్ ఆహ్వానిస్తోంది. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఫోన్ ట్యాపింగ్ జ‌రిగింద‌ని, ఇందుకు సంబంధించి విచార‌ణ జ‌రుపాల‌ని ప్ర‌త్యేకంగా సిట్ ను నియ‌మించ‌డంతో సిట్ త‌న విచార‌ణలో దూకుడు పెంచుతోంది. బీఆర్ ఎస్ పార్టీ నేత‌ల‌ను కొన్ని రోజులుగా విచార‌ణ‌కు పిలుస్తున్న పోలీసు అధికారులు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్సీ న‌వీన్ కుమార్, బీఆర్ ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడ‌ర్ హ‌రీష్ రావ్, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్, తాజాగా పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మాజీ ఎంసీ జోగిని ప‌ల్లి సంతోష్ రావ్ ల‌ను విచారించింది. ఒక్కో నేత‌ను సుమారు 7 గంట‌ల పాటు ఒక్కో నేత విచార‌ణ జ‌రిగింది. ఉద‌యం 11 గంట‌ల నుంచి సాయంత్రం 7 గంట‌ల వ‌ర‌కు హ‌రీష్, కేటిఆర్ ల‌ను విచారించిన సిట్ సంతోష్ రావ్ ను మూడు గంట‌ల‌కు విచార‌ణ‌కు పిలిచి దాదాపు రాత్రి ప‌ది గంట‌ల వ‌ర‌కు విచార‌ణ చేసింది. జూబ్టీ హిల్స్ పోలీస్ స్టేష‌న్ లో వ‌రుస‌గా విచార‌ణ జ‌రుగుతుండ‌డంతో బీఆర్ ఎస్ నేత‌లు వ‌రుస‌గా త‌మ నేత‌ల విచార‌ణ పూర్త‌య్యే వ‌ర‌కు పోలీస్ స్టేష‌న్ స‌మీపంలోనే ఉంటున్నారు. ఈ సంద‌ర్బంగా పోలీసుల‌కు, బీఆర్ ఎస్ నేత‌ల‌కు మ‌ధ్య వాగ్వాదం కూడా జ‌రుగుతోంది. పోలీసు విచార‌ణ ముగించుకుని వ‌చ్చిన నేత‌ల‌తో క‌లిసి పార్టీ నేత‌లు అక్క‌డి నుంచి వెళ్లి పోతున్నారు. కీల‌క నేత‌ల విచార‌ణ సంద‌ర్భంగా పార్టీ కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌స్తార‌ని అంచ‌నా వేస్తున్న పోలీసులు అందుకు అనుగుణంగా భ‌ద్ర‌తా చ‌ర్య‌ల‌ను కూడా చేపడుతున్నారు.

త‌రువాతి నోటీసులు కేసిఆర్, క‌విత‌కు ఇచ్చే చాన్స్…..

ఈ కేసులో పార్టీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి కేసిఆర్ కు కూడా నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. కీల‌క నేత‌లు, అప్ప‌ట్లో కీల‌క బాధ్య‌త‌ల్లో ఉన్న పోలీసు అధికారుల విచార‌ణ దాదాపు పూర్తి కావ‌డంతో ఇక కేసిఆర్ వంతు వ‌చ్చింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. కేసిఆర్ తో పాటు మాజీ ఎంపీ క‌విత త‌న ఫోన్ తో పాటు త‌న భ‌ర్త ఫోన్ కూడా ట్యాప్ అయింద‌న్న ఆరోప‌ణ‌లు చేస్తుండ‌డంతో క‌విత‌కు నోటీజులు జారీ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. అయితే ఈ కేసులో హ‌రీష్, కేటిఆర్ ల‌కు సాక్షిలుగానే విచార‌ణ‌కు పిలిచార‌ని అమాత్యులు ప్ర‌క‌టించ‌డం కొస‌మెరుపు. సాక్షిలుగా విచార‌ణ నిర్వ‌హిస్తే….దోషులుగా పోలీసులు ఎవ‌రిని తేలుస్తార‌న్న‌ది ఆస‌క్తి రేపుతున్న అంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *