
సిద్ధమైన 16 ఆపరేషన్ థియేటర్లు
అందుబాటులోకి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్
(హైదరాబాద్,న్యూస్ఇన్)
పేదలకు కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని ఉచితంగా అందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సనత్నగర్ టిమ్స్ (TIMS) ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఉగాది పండుగ రోజున ఈ హాస్పిటల్ను ప్రారంభించి ప్రజలకు అంకితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈలోగా సివిల్ పనులు, ఎక్విప్మెంట్ ట్రయల్స్ అన్నీ పూర్తి చేసి, హాస్పిటల్ను వైద్య సేవలు అందించేందుకు సిద్ధం చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీస్లో టిమ్స్ సనత్నగర్ పనుల పురోగతి, డాక్టర్లు, సిబ్బంది నియామకంపై మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఓపీ రూమ్లు, డయాగ్నస్టిక్స్, ఇన్పేషెంట్ డిపార్ట్మెంట్లు, వార్డులు, ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూల ఏర్పాటుపై మంత్రి ఆరా తీశారు. 1000 బెడ్ల కెపాసిటీతో నిర్మించిన సనత్నగర్ టిమ్స్లో మౌలిక వసతుల కల్పన తుది దశకు చేరుకుందని అధికారులు మంత్రికి వివరించారు. హాస్పిటల్ అత్యంత కీలకమైన 16 ఆపరేషన్ థియేటర్లు (OT) శస్త్రచికిత్సలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. రోగ నిర్ధారణ కోసం అత్యాధునిక సీటీ స్కాన్ (CT Scan), ఎంఆర్ఐ (MRI), డిజిటల్ ఎక్స్-రే మిషన్ల ఇన్స్టాలేషన్ ప్రక్రియ పూర్తయ్యిందన్నారు. డయాగ్నస్టిక్స్ యంత్రాలు ఇన్స్టాలేషన్ జరుగుతోందన్నారు. మార్చి రెండో వారం నాటికి అన్ని పనులు, ఎక్విప్మెంట్ ఇన్స్టాలేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. హాస్పిటల్ ప్రారంభమయ్యే నాటికి టెక్నీషియన్లకు, సిబ్బందికి ట్రైనింగ్ కూడా పూర్తి చేయాలని ఆదేశించారు.క్యాథల్యాబ్ ఏర్పాటు పనులు చివరి దశలో ఉన్నాయని, ఓటీలు ట్రయల్ రన్కు సిద్ధంగా ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు.

నగరంలోని నిమ్స్, ఉస్మానియా, గాంధీ హాస్పిటల్పై పెరుగుతున్న రోగుల ఒత్తిడిని తగ్గించేందుకు టిమ్స్ సనత్నగర్ ప్రధాన భూమిక పోషిస్తుందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ఆయా హాస్పిటళ్లలో శస్త్రచికిత్సల కోసం నెలల తరబడి వేచి చూస్తున్న రోగులను ఇక్కడికి రిఫర్ చేసి, త్వరితగతిన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయా హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు సమన్వయం చేసుకోవాలని మంత్రి సూచించారు.
నాన్ మెడికల్ సర్వీసెస్పై స్పెషల్ ఫోకస్…

హాస్పిటల్ నిర్వహణకు అవసరమైన ప్రొఫెసర్లు, డాక్టర్లు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది నియామక ప్రక్రియపై మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆరా తీశారు. పూర్తిగా కొత్త హాస్పిటల్ అయినందున.. డీఎంఈ, నిమ్స్ పరిధిలోని సీనియర్ డాక్టర్ల సేవలను సనత్నగర్ టిమ్స్లో వినియోగించుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. అలాగే, పారిశుధ్యం, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ సేవలను అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు చేయాలని సూచించారు.
ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవల కోసం ప్రభుత్వం
టెక్నాలజీతో మెరుగైన సేవలు…
రోగులకు ఓపీ (OP) రిజిస్ట్రేషన్ నుంచి డిశ్చార్జి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ-హెచ్ఎంఐఎస్ (e-HMIS) సాఫ్ట్వేర్ ద్వారా సేవలను అనుసంధానించాలని మంత్రి సూచించారు. రోగులకు, వారి సహాయకులకు నాణ్యమైన భోజనం అందించేందుకు సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేయాలని సూచించారు. మార్చి 15 నాటికి పెండింగ్లో ఉన్న చిన్న చిన్న పనులన్నీ పూర్తి చేసి, ఉగాది నాటికి హాస్పిటల్ను ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు.


Leave a Reply