మంజూరు చేసిన సీఎం
(హైదరాబాద్,న్యూస్ఇన్)
ఉద్యమ కాలంలో ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థినీ విద్యార్థులు ఆకాంక్షించిన స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కల్పన కోసం ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. చారిత్రాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయానికి గత వైభవం తీసుకురావడంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని చెప్పారు.ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా విద్యార్థినీ, విద్యార్థులు, అధ్యాపకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు.

విశ్వవిద్యాలయ అభివృద్ధికి వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ జారీ అయిన ఉత్తర్వులను విడుదల చేశారు. విశ్వవిద్యాలయ అభివృద్ధికి సిద్ధం చేసిన మాస్టర్ ప్లాన్, డిజైన్లను విద్యార్థుల సూచనల కోసం రూపొందించిన క్యూఆర్ కోడ్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. 108 సంవత్సరాల చరిత్ర కలిగి దేశంలోనే అత్యంత పురాతన యూనివర్సిటీల్లో 7 వ స్థానం, దక్షిణ భారత దేశంలో 3 వ ప్రాధాన్యత కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ అలనాటి స్ఫూర్తితో భవిష్యత్తుకు ప్రణాళికలు రూపొందించుకునే క్రమంలో అందరినీ కలవాలని వచ్చానని చెప్పారు.“గుండె నిండా అభిమానంతో యూనివర్సిటీకి వచ్చా. ఆర్ట్స్ కాలేజీ ముందు నిలబడి విశ్వవిద్యాలయ అభివృద్దికి భవిష్యత్తు ప్రణాళికలు రచించడానికి వచ్చాను. ఈ విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఇక్కడికి వచ్చాను.

చెక్కును అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

సమాజానికి ఏ సమస్య వచ్చినా యూనివర్సిటీ విద్యార్థులు కదలడం వల్లే ఆ సమస్యకు పరిష్కారం లభించింది. అందులో తెలంగాణ ఉద్యమం కూడా. ఉద్యమాలతో విద్యార్థులు ఏమీ ఆశించలేదు. వారు స్వేచ్ఛను, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కావాలని అడిగారు. యూనివర్సిటీని కాలగర్భంలో కలపడానికి కొందరు కుట్రలు పన్నారు. ఉస్మానియా ప్రపంచానికి దిక్సూచిలా గొప్పగా ఎదగాలన్నది నా సంకల్పం. విద్య ఒక్కటే అందరి జీవితాల్లో వెలుగులు నింపుతుంది. వెనుకబాటు నుంచి బయటపడేస్తుంది. ఆత్మగౌరవం పెరుగుతుంది. తల్లిదండ్రుల్లో ఆనందం నింపుతుంది.చదువుకుని భవిష్యత్తును నిర్మించుకోవాలి. సమస్యలొచ్చినప్పుడు నిటారుగా నిలబడి కొట్లాడండి. ప్రపంచాన్ని నడిపించగలరని నిరూపించాలి. నిబద్ధతతో కృషి చేయండి. ఇక్కడున్న వారిలోనే రేపు ఇలాంటి వేదిక నుంచి మాట్లాడే అవకాశం రావొచ్చు. మీలో కొందరు నాయకులై రాష్ట్రాన్ని పాలించాలని కోరుకుంటున్నా. 30-40 ఏళ్లుగా రగిలిన వర్గీకరణ అంశం దళిత బిడ్డల మధ్య విభజన రేఖను గీసింది.

ఈ సామాజిక సమస్యను పరిష్కరించిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ.గడిచిన వందేళ్లుగా ఈ దేశంలో బలహీన వర్గాల లెక్కలు లేవు. కేంద్రంపై ఒత్తిడి పెరిగి 2026 లో చేపట్టే జన గణననలో ఆ అంశాన్ని చేర్చారు.మనకు విద్య అందుబాటులో ఉంది కానీ నాణ్యమైన విద్య అందకపోవడమే సమస్య. నైపుణ్యం కలిగిన విద్యను అందించాల్సిన అవసరం ఉంది.విద్య కోసం పెట్టే ఖర్చు భవిష్యత్తరాల కోసం పెట్టుబడిగా చూస్తున్నాం. పిల్లల్లో నైపుణ్యాన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉంది. పరిశోధనల్లో ఇబ్బంది పడొద్దు. ప్రపంచంతో పోటీ పడాలి. ఆత్మస్థయిర్యం కోల్పోవద్దు. నాలెడ్జ్ వేరు, కమ్యునికేషన్ వేరు. నాలెడ్జ్, కమిట్మెంట్, కన్విక్షన్ దేశంలో ఏ స్థాయికి ఎదగడానికైనా ఉపయోగపడుతుంది.





Leave a Reply