
-సుప్రీం కోర్టు అభిప్రాయం
(హైదరాబాద్,న్యూస్ఇన్)
దేశవ్యాప్తంగా జైళ్లలో పెరుగుతున్న రద్దీపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. జైళ్లలో ఈ పరిస్థితిని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలతో పాటు అందుబాటులో ఉన్న వసతులపై పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశవ్యాప్తంగా జైళ్లలో స్థితిగతులపై దాఖలైన పిటిషన్ను సుమోటోగా విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం, ఈ ఏడాది మార్చి 1 నాటికి జైళ్లలో ఉన్న ఖైదీల సంఖ్య, మంజూరైన సామర్థ్యం వంటి వివరాలను మే 18 లోగా అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని అన్ని రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను ఆదేశించింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
చిన్నారుల గురించి……..
జైళ్లలోని చిన్నారులకు అందుతున్న విద్య, ఆరోగ్య సదుపాయాలపై నివేదిక ఇవ్వాలని సూచించింది.
మహిళా ఖైదీలతో పాటు వారితోపాటు ఉంటున్న చిన్నారుల భవిష్యత్తుపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. జైళ్లలో ఆయా చిన్నారులకు అందుతున్న విద్య, ఆరోగ్య సదుపాయాలపై స్పష్టత ఇవ్వాలని కోరింది. జైళ్లలో ఖాళీగా ఉన్న పోస్టులు, వాటి భర్తీకి తీసుకుంటున్న చర్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అమికిస్ క్యూరీ అందించిన వివరాలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు జైళ్లలో పాలనా సంస్కరణలు అనివార్యమని అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే ఈ కేసు తదుపరి విచారణను మే 26కు వాయిదా వేసింది.








Leave a Reply