NewsInn

News in a Click

గోదావరి డెల్టాకు శాశ్వత భద్రత…..!

గోదావరి డెల్టాకు శాశ్వత భద్రత…..!

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌)

గోదావరి డెల్టాకు శాశ్వత రక్షణ కల్పించే చర్యలను కూటమి ప్రభుత్వం చేపట్టిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. దీంట్లో భాగంగానే సర్ అర్థర్ కాటన్ బ్యారేజ్ కు కొత్త గేట్లను అమరుస్తున్నట్టు చెప్పారు. ధవళేశ్వరం బ్యారేజీకి రూ.152.95 కోట్ల వ్యయంతో 117 కొత్త గేట్లను అమర్చే పనులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ మేరకు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. వచ్చే ఏడాది జూన్ నెలకు కొత్తగేట్ల బిగింపు ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు గేట్లను అమర్చే పనులను పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని పిచ్చుకలంకలో రైతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

నిర్వాసితులను ఆనందంగా ఉంచుతాం

ఒకప్పుడు కోనసీమలో వరికి మద్దతు ధర లేక రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి నెలకొంటే, ఇప్పుడు రైతుల ధాన్యానికి గిట్టుబాటు ధరతో పాటు విక్రయించిన 24 గంటల్లోనే డబ్బులు వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని, అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని సీఎం విమర్శించారు. పోలవరం పూర్తయితే గోదావరి జిల్లాలకు నీటి సమస్య శాశ్వతంగా తీరుతుందని, పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టా, రాయలసీమకు తరలించి అక్కడి వ్యవసాయ రూపురేఖలనే మార్చామని ముఖ్యమంత్రి వివరించారు. మైక్రో ఇరిగేషన్ విస్తరించడంతో ఉద్యాన పంటలు అభివృద్ధి చెందాయని, పరిశ్రమలకు నీటి సరఫరా సాధ్యమై కియా వంటి భారీ పరిశ్రమలు రాయలసీమకు వచ్చాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

అభివృద్ధి-సంక్షేమమే కూటమి లక్ష్యం…..

రాష్ట్ర పునర్నిర్మాణమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రధాని నరేంద్ర మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో కలిసి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ నెలలోనే తల్లికి వందనం నిధులు జమ చేస్తామని, సామాజిక భద్రత పెన్షన్లు, రైతు సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నప్పటికీ ప్రజల మధ్యకే రావాలనే తపనతో ఉన్నారని, ముంబై వెళ్లి ఆయనను పరామర్శించి పూర్తిగా కోలుకున్న తర్వాతే ప్రజాసేవలో పాల్గొనాలని సూచించినట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *