NewsInn

News in a Click

బారువ నుంచి నెల్లూరు వరకూ బీచ్‌ల అభివృద్ధి

బారువ నుంచి నెల్లూరు వరకూ బీచ్‌ల అభివృద్ధి

స‌మీక్ష‌లో చంద్రబాబు

(అమరావతి,న్యూస్ ఇన్‌)

రాష్ట్రంలో పెరుగుతోన్న పర్యాటకుల ఫుట్ ఫాల్‌కు అనుగుణంగా ఏపీలో హోటల్ గదులు, హోం స్టేలను త్వరితగతిన అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యాటక శాఖకు దిశానిర్దేశం చేశారు. స‌ముద్ర తీర ప్రాంతంగా ఉన్న బారువా నుంచి నెల్లూరు వ‌ర‌కు బీచ్ లు ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ట్టుకునేలా అభివృద్ధి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. రాష్ట్రంలో 2029 నాటికి రాష్ట్రంలో 50 వేల హోటల్ గదుల నిర్మాణం లక్ష్యాన్ని చేరుకోవాలని సీఎం సూచనలు చేశారు. అలాగే వివిధ పర్యాటక ప్రాంతాల్లో 10 వేలకు పైగా హోం స్టేలు కూడా అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు. హోంస్టేలను అందుబాటు లోకి తీసుకువచ్చే అంశంపై ఎలాంటి పరిమితీ లేదని వివరించారు. క్యాంపు కార్యాలయంలో పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అరకు, చింతపల్లి, ముంచింగిపుట్టు, గాంధీవనం, మారేడుమిల్లి తదితర ప్రాంతాలతో పాటు కనీసం 10-15 ప్రాంతాల్లో కారావాన్ పార్కులను ఏర్పాటు చేయాలని సూచించారు. అటవీ, దేవాదాయ శాఖల సమన్వయంతో ఎకో, టెంపుల్ టూరిజానికి ప్రోత్సాహం ఇచ్చేలా ప్రాజెక్టులు చేపట్టాలని సీఎం పేర్కొన్నారు. గోదావరి పుష్కరఘాట్‌ను ఆగస్టు నాటికి, హావ్ లాక్ బ్రిడ్జిపైకి పర్యాటకులను అనుమతించేలా ఈ ఏడాది డిసెంబరు నాటికి పనులు పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు.

పర్యాటక ప్రోత్సాహానికి సీఎస్ అధ్యక్షతన కమిటీ….

రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఓ బోర్డు లేదా కమిటీ ఏర్పాటు చేసి ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లాలని సీఎం సూచించారు. పర్యాటకశాఖ, అటవీ, దేవాదాయ, పోలీసు, మెరైన్ ఇలా వేర్వేరు శాఖల సమన్వయం కోసం సీఎస్ అధ్యక్షతన దీనిని ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. హౌస్ బూట్లు, హెలీ టూరిజంతో పాటు ఉడాన్ పథకం కింద సీ ప్లేన్‌లను కూడా ప్రోత్సహించాలని అన్నారు. విశాఖ, విజయవాడ, శ్రీశైలం, గండికోట, కంభం చెరువు లాంటి చోట్ల వాటర్ ఏరో డ్రోమ్స్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించాలని సూచించారు. సముద్ర విహారాన్ని ప్రోత్సహించేలా విశాఖ, నెల్లూరులోని కృష్ణపట్నం పోర్టుల నుంచి క్రూజ్ నౌకలను కూడా నిర్వహించేలా చూడాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *