సీఎం రేవంత్ వ్యూహంతో ఎంఐఎం గిల గిల
(హైదరాబాద్, న్యూస్ఇన్)
నగరంలో పట్టున్న పార్టీగా గుర్తింపు ఉన్న ఎంఐఎం పార్టీ పాత బస్తీలోని అన్ని స్థానాల్లో తమ పట్టును నిలుపుకుంటూ వస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ లలో ఎంఐఎం ను ఢీ కొట్టేందుకు ఇతర రాజకీయ పార్టీలు కూడా దరి దాపుల్లో కనిపించవు. ఇక ఆ పార్లమెంట్ స్థానం వారి ఖాతాలోనే పడడం అనవాయితీగా మారింది. ఎన్నికల సమయంలో హీట్ పుట్టించినా పాతబస్తీలోని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో వారి నుంచి ఇతర పార్టీలు దక్కించుకోవడం దాదాపు అసాధ్యంగా మారింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా ఎంఐఎం ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. మైనార్టీల్లో ప్రభావ వంతమైన నేతలుగా ఒవైసీ బ్రదర్స్ పట్టు సాధించారు. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నికల్లోనూ ఎంఐఎం మద్దతు లేనిదే మేయర్ స్థానం కైవసం చేసుకోవడం రాజకీయంగా ఇబ్బంది కరంగానే ఉంటుందని ప్రధాన రాజకీయ పార్టీలు ఎత్తులు వేస్తుంటాయి. అధికారంలో ఏ రాజకీయ పార్టీ ఉన్నా…..తమ చెప్పు చేతుల్లోనే ఉంటుందని ఎంఐఎం పార్టీల నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తుంటారు. ఆ స్థాయిలో వారి ప్రభావం ఉందంటే రాజకీయంగా ఆ పార్టీ నేతలు పట్టు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు….

ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ఆ పార్టీ ఉనికికే ప్రమాదం తెచ్చి పెట్టేలా కనిపిస్తోంది. గ్రేటర్ మేయర్ పదవి దక్కించుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఆ పార్టీ మద్దతు లేకుండా సాధ్యాసాధ్యలపై ఎత్తులు వేస్తుంటాయి. కానీ పూర్తి ధీమాతో ముందుకు వెళ్లేందుకు మాత్రం ప్రధాన రాజకీయ పార్టీలు సైతం వెనుకడుగు వేస్తుంటాయి. ఈ స్థాయిలో పట్టున్న పార్టీ ఇప్పుడు గ్రేటర్ లో ఇక నామమాత్రంగా మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది.45 వేల జనాభాకు ఒక డివిజన్ ను ఏర్పాటు చేయాలన్న అభిప్రాయంతో సర్కార్ ఉంది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం 150 డివిజన్లు ఉన్నాయి. పాతబస్తీలోని 7అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 50 స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులు కనీసం 40 స్థానాలకు తగ్గకుండా దక్కించుకుంటారు. ఈ సంఖ్య కాస్త అటు ఇటుగా ఉన్నా.. 40కి పైగా స్థానాలు మాత్రం వారి ఖాతాలో ఉంటాయనేది బహిరంగ రహస్యంగా మారింది. ప్రస్తుతం ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ పరిధిని భారీగా విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపలి ప్రాంతాలలో ఉన్న మున్సిపాల్టీలు, కార్పోరేషన్లను విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగర విస్తీర్ణం పెరగడంతో ఇక డివిజన్ల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది.300 డివిజన్లను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం అన్నిరాజకీయ పార్టీ ల అభిప్రాయలు తీసుకుంటోంది.త్వరలో ఇది
ఆచరణలోకి రాబోతుంది. డివిజన్ల సంఖ్య పెంపుపై ప్రధాన రాజకీయ పార్టీలకు ఎలాంటి అభ్యంతరాలు లేవు…కానీ డివిజన్లను ఏర్పాటు చేస్తున్న విధానంపై అన్నిరాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇదంతా ఒక వైపు మాత్రమే

మరోవైపు ఈ విస్తరణ ప్రభావంతో ఎంఐఎం తమ ఉనికిని గ్రేటర్ లో కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. 150 డివిజన్లలో దాదాపు 50స్థానాలు దక్కించుకుంటే మేయర్ పీఠంపై ఎవరున్నా….వారిని బలమైన మిత్రపక్షం లేదంటే ప్రతిపక్షంగా ఇరుకున పెట్టేందుకు అవకాశం ఉంటుంది. ప్రతిపక్షం కంటే మిత్రపక్షంగా ఉంటూ అంశాల వారిగా ప్రభుత్వాలతో విబేధించడం ఎంఐఎం అనవాయితీ. రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఇదే విధానాన్ని ఆ పార్టీ అవలంభిస్తోంది. ఇప్పుడు గ్రేటర్ పరిధిని 300 డివిజన్లకు పెంచితే….ఎంఐఎం పార్టీ పై ప్రధానరాజకీయ పార్టీలు ఆధార పడడం దాదాపు అసాధ్యంగా మారుతుంది.

ఎంఐఎం 50 స్థానాల్లో విజయం పెద్దగా ప్రభావం చూపే అవకాశం ఉండదు. పాతబస్తీ ప్రాంతానికే ఆ పార్టీ పరిమితం కాక తప్పుదు. ప్రధాన పార్టీలు గ్రేటర్ లో తప్పని సరైతేనే ఎంఐఎం మద్దతు కోరే పరిస్థితులు తలెత్తవచ్చు లేదంటే మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటే ఆ పార్టీతో అవసరం లేకుండానే పోతుంది. అయితే ప్రభుత్వం మాత్రం గ్రేటర్ పరిధిని విస్తరిస్తూ 3లేదా నాలుగు కార్పోరేషన్లను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీంతో పాతబస్తీ ప్రాంతానికి కొన్ని శివారు ప్రాంతాలు కలిసి కార్పోరేషన్ గా ఏర్పాటైనా…..ఎంఐఎం పార్టీ ఆ ఆ ప్రాంతానికే పరిమితం అవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రభుత్వం డివిజన్ల సంఖ్యను పెంచడం…. కొత్త ప్రతిపాదనలపై ఎంఐఎం కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మొత్తం మీద డివిజన్ల సంఖ్య పెరగడం ఎంఐఎం పార్టీకి గ్రేటర్ పరిధిలో రాజకీయంగా పట్టు సాధించడం అంత తేలిక కాదన్న వాదన మొదలైంది. సిఎం వ్యూహం ఆపార్టీకి
కొత్త చిక్కులు తెచ్చేలా ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది.







Leave a Reply