NewsInn

News in a Click

అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ : కేటీఆర్

అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ : కేటీఆర్

రాహుల్ గాంధీకి రాజ్యాంగంపై గౌరవం లేదు

ఉప ఎన్నికలకు భయపడే అనర్హత వేటు వేయడం లేదు

ప్రజాక్షేత్రంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎప్పుడో అనర్హలు

(హైదరాబాద్,న్యూస్ఇన్)

అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్పీకర్ నిర్ణయంపై స్పందిస్తూ, దేశ అత్యున్నత న్యాయస్థానాలపైనే కాదు, చివరికి రాజ్యాంగంపై కూడా రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం గౌరవం లేదని మరోసారి తేలిపోయిందని విమర్శించారు.కేవలం ఫోటోలకు ఫోజులిచ్చేందుకు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని తిరిగితే సరిపోదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. “స్వంత తండ్రి రాజీవ్ గాంధీ గారు తెచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టాన్నే గౌరవించలేని అసమర్థ నాయకుడిగా రాహుల్ గాంధీ చరిత్రలో మిగిలిపోతారన్నారు.
అభివృద్ధి కోసం పార్టీ మారినట్టు సాక్షాత్తు ఫిరాయింపు ఎమ్మెల్యేలే అనేకసార్లు బాహాటంగా ప్రకటించినా, వారిని కాపాడటం రాహుల్ గాంధీ, మరియు కాంగ్రెస్ పార్టీ రెండు నాల్కల ధోరణికి నిదర్శనం” అని మండిపడ్డారు.

ఉప ఎన్నికల భయంతోనే కాంగ్రెస్ వెనకడుగు

రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనా వైఫల్యాలపై పంచాయతీ ఎన్నికల్లో ప్రజావ్యతిరేకత వెల్లువెత్తుతోందని, ఆ భయంతోనే కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలు అంటే జంకుతోందని కేటీఆర్ అన్నారు. అందుకే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తోందని, తెలంగాణ సమాజానికి ఈ విషయం స్పష్టంగా అర్థమైపోయిందన్నారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి మరీ సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపులకు తెరతీసిన నాటి నుంచి, నేటి స్పీకర్ నిర్ణయం వరకు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అడుగడుగునా అపహాస్యం చేస్తూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *