NewsInn

News in a Click

మండుతున్న ఎండ‌లు-పిట్టల్లా రాలుతున్న జ‌నం

మండుతున్న ఎండ‌లు-పిట్టల్లా రాలుతున్న జ‌నం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఊష్ణోగ్ర‌తలు న‌మోదౌతున్నాయి. మండుతున్నఎండ‌లు, వ‌డ‌గాలుల‌తో జ‌నం రాలుతున్నారు. ఏపీలో 48 డిగ్రీలకు పైగా ఊష్ణోగ్ర‌త‌లు న‌మోదు కాగా తెలంగాణాలో దాదాపు 47 డిగ్రీల వ‌ర‌కు ఊష్ణోగ్ర‌త‌లు న‌మోదౌతున్నాయి. సోమ‌వారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో భానుడి భ‌గ‌భ‌గ‌లు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. రోహిణీ కార్తె మొద‌లు కానున్న నేప‌థ్యంలో ఎండ‌లు మ‌రింత తీవ్రం కానున్నాయి. గ‌త నాలుగైదు రోజుల్లోనే తెలంగాణాలో వడ‌గాలులు, ఎండ వేడిమితో వంద మందికి పైగా మృతి చెందార‌ని అంచ‌నా. ఏపీలో కూడా గ‌త రెండు రోజుల్లో 20 మందికి పైగా మృత్యువాత ప‌డ్డార‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వ‌డ‌గాలుల‌తో మృతుల సంఖ్య పెరుగుతుండ‌డంతో ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్తం అవుతున్నాయి. ఉపాధి హామీ ప‌నుల‌తో పాటు ఇత‌ర ప‌నుల‌ను చేసేందుకు మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో విరామం ఇవ్వాల‌ని ప్ర‌భుత్వాలు సూచిస్తున్నాయి.వ‌డ‌గాలుల ప్ర‌భావంతో మృతుల సంఖ్య పెరుగుతుండ‌డంతో ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న కూడా మొద‌లౌతుంది. ఎండ‌ల్లో బ‌య‌ట‌కు వెళ్లేందుకు ఆలోచించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌….

తెలంగాణాలో ఉత్త‌ర తెలంగాణా, కోల్ బెల్డ్ ఏరియ‌లో వేస‌వి ప్ర‌భావం తీవ్రంగా ఉంది. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఎండల ప్రభావం అత్యధికంగా కనిపిస్తోంది. మధ్యాహ్నం 11 గంటల తర్వాత బయటకు రావడమే కష్టంగా మారింది. హైదరాబాద్‌లో కూడా పరిస్థితి భిన్నంగా లేదు. నగరంలో ఉదయం నుంచే వేడి గాలులు మొద‌లై ఒక్కో రోజు రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు కూడా వాటి ప్రభావం త‌గ్గ‌డం లేదు. ఆంధ్ర ప్ర‌దేశ‌లోని కృష్ణా, గుంటూరు, బాప‌ట్ల‌,ప‌ల్నాడు, ఏలూరు జిల్లాల్లో వేస‌వి ప్ర‌భావం ఎక్కువ‌గా క‌నిపిస్తోంది.చాలా సందర్భాల్లో ఎండలో ఎక్కువగా పనిచేయడం, తగినంత నీరు తాగకపోవడం, శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరగడం వల్ల హీట్ స్ట్రోక్‌కు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు వెళ్లిన రైతులు, నిర్మాణ కార్మికులు వ‌డ‌దెబ్బ‌కు గురౌతున్నారు.

ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో డీహైడ్రేషన్, అలసట, తలనొప్పి, వాంతులు, జ్వరం వంటి సమస్యలతో వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా వృద్ధులు, బీపీ, షుగర్ సమస్యలతో బాధపడుతున్నవారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

హీట్ స్ట్రోక్ లక్షణాలు…..

అధిక జ్వరం

శరీరం వేడిగా మారడం

చెమట ఆగిపోవడం

వాంతులు

స్పృహ కోల్పోవడం

వాతావరణ మార్పుల ప్రభావం….

ఈ పరిస్థితికి ప్రధాన కారణం వాతావరణ మార్పులేనని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఏడాది వేసవి కాలం మరింత తీవ్రంగా మారుతోందని, అడవుల నరికివేత, భూగర్భ జలాల తగ్గుదల, పట్టణీకరణ కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని హెచ్చరిస్తున్నారు.గతంలో అరుదుగా నమోదయ్యే 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఇప్పుడు సాధారణంగా మారుతున్నాయి. భవిష్యత్తులో ఈ పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జాగ్రత్తలు…..

ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు బయటకు వెళ్లకూడదు

ఎక్కువగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగాలి

తేలికపాటి కాట‌న్ దుస్తులు ధరించాలి

చిన్నపిల్లలు, వృద్ధులను ప్రత్యేకంగా జాగ్రత్తగా చూసుకోవాలి

వాహనాల్లో పిల్లలను ఒంటరిగా వదిలేయకూడదు

ఎండలో పని చేసే వారు మ‌ధ్య మ‌ధ్య‌లో విశ్రాంతి తీసుకోవాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *