(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణలో డీజిల్, పెట్రోల్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా అంతరాయం లేకుండా పెట్రోల్ (ఎంఎస్), డీజిల్ (హెచ్ఎస్డీ), ఎల్పీజీ అందుబాటులో ఉండేలా చూసేందుకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లు.. తమ కార్యకలాపాలు, రవాణా ఏర్పాట్లను సమన్వయం చేసుకుంటున్నాయి.
వివిధ రంగాల్లో ఇంధన డిమాండ్ ఒక్కసారిగా పెరిగినప్పటికీ సరఫరా వ్యవస్థ ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగా సాగుతోంది. ముఖ్యంగా 2026 మే నెలలో తెలంగాణలో పంట కోత, వ్యవసాయ పనులు ఊపందుకోవటంతో పాటు భారీ ఎత్తున ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోంది. దీనివల్ల ఇటీవల కాలంలో చమురు ఉత్పత్తులకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. ధరలు తక్కువ ఉండటంతో ప్రైవేట్ బంకుల వినియోగదారులు సైతం ప్రభుత్వ రంగ పెట్రోల్ బంకుల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ రంగ విక్రయ కేంద్రాల్లో ధరల ప్రయోజనం ఉండటంతో సంస్థాగత, వాణిజ్య వినియోగదారులు సైతం వీటి నుంచే ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నారు.

2026 మే నెలలో తెలంగాణలో ఇంధన విక్రయాలు భారీ వృద్ధిని నమోదు చేశాయి. సాధారణ వృద్ధి రేటు కంటే ఎక్కువగా.. డీజిల్ (రిటైల్) విక్రయాలు 12.6 శాతం, పెట్రోల్ (రిటైల్) విక్రయాలు 9 శాతం పెరిగాయి. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ప్రభుత్వ రంగ (పీఎస్యూ) పెట్రోల్ బంకుల్లో జరిగిన డీజిల్ అమ్మకాలు 25 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేయగా.. 12 జిల్లాల్లో 15 నుంచి 25 శాతం మధ్య వృద్ధి నమోదైంది. మే నెలలో చమురు మార్కెటింగ్ సంస్థలు (ఓఎంసీ) తెలంగాణవ్యాప్తంగా 37 లక్షలకు పైగా గృహావసరాల ఎల్పీజీ సిలిండర్లను సరఫరా చేశాయి.
పెరిగిన డిమాండ్ను సమర్థవంతంగా అధిగమించడానికి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు నిరంతరం నిల్వల స్థితిగతులను సమీక్షిస్తున్నాయి. దీనితో పాటు రవాణా, పంపిణీ ప్రణాళికలను అవి నిశితంగా సమన్వయం చేసుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ తగినంత అందుబాటులో ఉన్నాయని వినియోగదారులకు భరోసా ఇస్తున్న చమురు పరిశ్రమ.. కేంద్ర పెట్రోలియం శాఖ, రాష్ట్ర పరిపాలనా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ నిరంతర సరఫరాకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.










Leave a Reply