(హైదరాబాద్, న్యూస్ఇన్)
రాష్ట్రంలో మహిళల అభివృద్ధికి రైస్ మిల్లులు, సూపర్ మార్కెట్లు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మహిళా సంఘాలకు ముఖ్యమంత్రి వరాలు ప్రకటించారు.మహిళా శక్తిని గౌరవిస్తూ, మహిళల ఆర్థిక స్వావలంబనకు మరింత బలం చేకూర్చే లక్ష్యంతో నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించనున్న 8 వేల గ్రామ మహిళా సమాఖ్య భవనాలకు ముఖ్యమంత్రి సచివాలయం నుంచి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయా గ్రామాల్లో గ్రామస్థులు, మహిళా సమాఖ్య సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి స్థానికంగా శంకుస్థాపనలు నిర్వహించి పనులను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
మహిళా సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మహిళా సంఘాలకు మరిన్ని ఉపాధి, వ్యాపార అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలను పారిశ్రామిక రంగంలోకి తీసుకురావడంలో భాగంగా మహిళల ఆధ్వర్యంలో రైస్ మిల్లుల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోందన్నారు. ఇందుకోసం అవసరమైన భూమి, బ్యాంకు రుణాలు, ఇతర మౌలిక సదుపాయాలను ప్రభుత్వం సమకూర్చుతుందని సీఎం హామీ ఇచ్చారు.

అలాగే మహిళల చేత సూపర్ మార్కెట్ల ఏర్పాటు చేయించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపడుతోందన్నారు. మహిళా సంఘాలకు 30 సంవత్సరాల పాటు ప్రభుత్వ భూములను లీజుకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. మహిళలు కేవలం పొదుపు సంఘాలకే పరిమితం కాకుండా వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో ముందుకు రావాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు.

జిల్లాల్లోని మహిళా సమాఖ్య సభ్యులతో సీఎం ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. వారి వ్యాపార అనుభవాలు తెలుసుకుని..వారి ఆర్దిక బలోపేతం కోసం తీసుకొవాల్సిన చర్యలపై చర్చించి అనుగుణంగా అధికారులకు పలు సూచనలు చేశారు.
సీఎంకు కృతజ్ఞతలు-సీతక్క
మహిళల ఆర్థిక సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటోందని మంత్రి సీతక్క అన్నారు. గ్రామీణ మహిళల జీవితాల్లో స్థిరమైన మార్పు తీసుకురావాలనే సంకల్పంతో సీఎం, మంత్రివర్గ సహచరులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. మహిళలకు కొత్త ఆర్థిక అవకాశాలు కల్పిస్తూ, వ్యాపారాల్లో ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి, మంత్రివర్గ సహచరులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
మహిళా వారోత్సవాల సందర్భంగా వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు, అవగాహన సదస్సులు, మహిళా సంఘాల ప్రదర్శనలు, ఆర్థిక సాధికారత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.










Leave a Reply