NewsInn

News in a Click

సామాన్యుడికి అందుబాటులో ధరలు ఉండాలి: సీఎం

సామాన్యుడికి అందుబాటులో ధరలు ఉండాలి: సీఎం

(న్యూస్ఇన్‌, అమ‌రావ‌తి)

నిత్యావసరాల ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్ర‌బాబు అధికారుల‌కు సూచించారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ముందస్తు అంచనాలతో పంటల సాగు, ఉత్పత్తి, మార్కెట్ నిర్వహణపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయం, అనుబంధ శాఖలపై ముఖ్యమంత్రి బుధవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ద్రవ్యోల్బణం పెరగడానికి గల కారణాలను అంచనా వేయాలని సీఎం సూచించారు. ఉత్పత్తి డిమాండ్ కు తగ్గట్టు ఉందా, సరఫరా పరిస్థితులను.. అనే అంశాలను విశ్లేషించుకుని దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ధరల నియంత్రణకు మార్కెట్ ఇంటర్వెన్షన్….

ఎలాంటి చోట్ల, ఏయే పంటలకు మార్కెట్ ఇంటర్వెన్షన్ అవసరమో గుర్తించాలని, ధరలు పెరగకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. ఈ మేరకు వివిధ పంటలకు కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరలను రాష్ట్రంలో అమలు చేయడంతో పాటు, రైతులను ఆయా పంటలు సాగు చేసేలా ప్రొత్సహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ధరలను నియంత్రణ చేసేలా చూడాలన్నారు.

రేషన్ డిపోల ద్వారా సరఫరా…..

రైతు బజార్లు, రేషన్ డిపోల ద్వారా దాదాపు 60 రకాల నిత్యావసర సరుకులు సరఫరా చేసేలా చూడాలని సీఎం సూచించారు. ఉల్లి, కంది పప్పు వంటి వాటిని త్వరలో రైతు బజార్లు, రేషన్ డిపోల ద్వారా అందించాలన్నారు. పామాయిల్ ను కూడా రేషన్ డిపోల ద్వారా సరఫరా చేయాలన్నారు. ఉల్లి, మిర్చి వంటి పంటలను ఎప్పుడూ పండించే ప్రాంతాల్లో కాకుండా.. ఇతర ప్రాంతాల్లో కూడా పండించే అంశాన్ని పరిశీలించాలని సీఎం ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *