(న్యూస్ఇన్, హైదరాబాద్)
పఠాన్ చెరు సమీపంలో వినాయక నిమజ్జనం సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని పెద్దకంజర్ల గ్రామ సమీపంలో శిరీష అనాథాశ్రమం విద్యార్థులు వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు సమీపంలోని చెరువుకు వెళ్లారు. నిమజ్జనం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఆనాధాశ్రమానికి చెందిన 6 గురు విద్యార్థులు చెరువులో గల్లంతయ్యారు. నీటిలో మునిగిపోతున్న వారిని కాపాడే ప్రయత్నం చేసుకుంటూ ఒకరి కొకరు పట్టుకోవడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన స్థానికులు రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. వినాయక నిమజ్జనం చేసే చెరువులో పెద్ద పెద్ద గుంటలు ఉండడంతో ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు కేసీఆర్, హరీష్, కేటిఆర్ లు విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా అన్ని ముందుస్తు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన విద్యార్థులు 8,9,10 తరగతి చదువుతున్నట్లు గుర్తించారు. ఈ ఘటన అందరినీ కలిచి వేసింది.













Leave a Reply