నిందితుడు మాజీ సైనిక అధికారే….!!
(న్యూస్ఇన్,హైదరాబాద్)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొల్లారం వెపన్స్ మిస్సింగ్ కేసులో మిస్టరీ వీడింది. అటు సైనిక అధికారులు, ఇటు పోలీసులు విచారణ జరిపిన ఈ కేసులో నిందితుడు మాజీ సైనిక అధికారి అని గుర్తించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే ఆయుధాలు చోరీ కావడం సంచలనం సృష్టించింది. చోరీకి గురైన 12 అత్యాధునిక తుపాకుల కేసును మల్కాజిగిరి పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మద్రాసు రెజిమెంట్కు చెందిన మాజీ మిలటరీ అధికారిని పోలీసులు నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు సమాచారం.దర్యాప్తులో భాగంగా హైదరాబాద్లోని ఓ ఇంట్లో దాచిన ఆయుధాలను పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి 12 ఏకే-47, ఇన్సాస్ గన్స్తో పాటు సుమారు 1,200 బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం.
10 రోజులుగా పోలీసుల దర్యాప్తు…

మిలట్రీ వెపన్స్ చోరీ అయ్యాయని ఫిర్యాదు అందుకున్న మల్కాజిగిరి పోలీసులు గత పది రోజులుగా ఈ కేసుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆయుధాల భద్రత, ఆ ప్రాంతంలో వ్యక్తుల కదలికలపై పోలీసులు పూర్తి స్థాయిలో ఆరా తీశారు. ఆయుధాలు నిల్వ చేసే ప్రాంతం నుంచి కంపౌండ్ నుంచి వచ్చే పోయే దారులను పరిశీలించారు ఈ క్రమంలో మాజీ మిలటరీ అధికారిపై అనుమానం కలిగింది. అత్యంత భద్రత ఉన్న మిలటరీ కంపౌండ్ నుంచి ఆయుధాలను బయటకు ఎలా తీసుకువచ్చారు? వాటిని ఎక్కడికి తరలించారు? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తుపాకులు ఎందుకు తీసుకెళ్లాడు…?
మాజీ మిలటరీ అధికారి ఆయుధాలను ఎందుకు బయటకు తీసుకెళ్లాడు? వాటిని ఎవరి కోసం దాచాడు? ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా? ఆయుధాలను ఎక్కడెక్కడికి తరలించేందుకు ప్రయత్నించారు? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగించారు. పోలీసులు ఈ కేసు వివరాలను ఈ రోజు సాయంత్రం వెల్లడించే అవకాశం ఉంది. సైనిక ప్రాంగణం నుంచి తుపాకులు చోరీ కావడంతో పోలీసులు కూడా విచారణను గోప్యంగా చేశారు. కేసులో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్న తరువాత కేసు కు సంబంధించి మిస్టరీ విడిందన్న సమాచారం మాత్రమే బయటకు వచ్చింది.












Leave a Reply