(న్యూస్ఇన్, అమరావతి)
సంక్షేమ పథకాల కోసం కుటుంబాలు చిన్న కుటుంబాలుగా విడిపోవాల్సిన పరిస్థితి లేకుండా భవిష్యత్తులో అన్ని పథకాలను ‘ఫ్యామిలీ యూనిట్’గా అమలు చేసే విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కొత్త పెన్షన్లు మంజూరు చేసేలోపే కుటుంబాల మ్యాపింగ్ పూర్తి చేయాలని సూచించారు. ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులను యథాతథంగా కొనసాగించాలన్నారు.రేషన్ విషయంలో కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున బియ్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల కోసం రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేశామని, ఇందులో పెన్షన్లకే రూ.75 వేల కోట్లు వెచ్చించినట్లు తెలిపారు.

సంక్షేమం నుంచి కుటుంబ సాధికారత వైపు అడుగులు వేయాలని సీఎం అన్నారు. సెర్ప్, మెప్మా ఆధ్వర్యంలో వన్ ఫ్యామిలీ.. వన్ ఎంట్రప్రెన్యూర్ కార్యక్రమాన్ని విస్తృతం చేయాలని సూచించారు. ప్రతి నెలా మొదటి తేదీన ‘పేదల సేవలో’, 9న ‘మీ భూమి–మీ హక్కు’, మూడో శనివారం ‘స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర’, నాలుగో శనివారం ‘సంజీవని’ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయాలని కలెక్టర్లకు సూచించారు.
యానాటి కొండ సామాజిక వర్గాన్ని ఎస్టీల్లో చేర్చాలన్న డిమాండ్పై మంత్రి అచ్చెన్నాయుడు ప్రస్తావించారు. ఈ అంశం కేంద్ర పరిధిలో ఉన్నందున, అప్పటివరకు ఎస్టీలకు అందుతున్న ప్రయోజనాలను ఆ వర్గానికి అందించేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.












Leave a Reply