NewsInn

News in a Click

అసదుద్దీన్ దేశభక్తిపై సీఎం రేవంత్ ప్రశంసలు.. హిందుస్థాన్‌కు మద్దతు ఇచ్చారు

అసదుద్దీన్ దేశభక్తిపై సీఎం రేవంత్ ప్రశంసలు.. హిందుస్థాన్‌కు మద్దతు ఇచ్చారు

(న్యూస్ఇన్‌,హైదరాబాద్)

రాజకీయ సిద్ధాంతాలు వేరు కావచ్చు కానీ దేశభక్తి విషయంలో భారతీయులందరూ ఒక్కటేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ హిందుస్థాన్‌కు మద్దతుగా నిలిచి తన దేశభక్తిని చాటుకున్నారని ఆయన ప్రశంసించారు.చంచల్‌గూడ-సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్‌లోని పాతబస్తీని తాను గతంలోనే ఓల్డ్ సిటీ కాదని, ఒరిజినల్ సిటీ అని చెప్పానని గుర్తు చేశారు. ఇక్కడి ప్రతి గల్లీ తనకు తెలుసన్నారు.

అసదుద్దీన్ ఓవైసీ కోరిన అభివృద్ధి పనులన్నింటినీ పరిశీలించి మంజూరు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే బలాల కళాశాల అభివృద్ధి కోసం రూ.20 కోట్లు కోరారని, తాను రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నిధులు మంజూరు చేయడం ప్రభుత్వ బాధ్యత అయితే, ఏడాదిన్నరలోపు అభివృద్ధి పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేదే అన్నారు.

పాతబస్తీకి కేబుల్ బ్రిడ్జి, మెట్రో విస్తరణ…

కేబుల్ బ్రిడ్జిని చూడాలంటే ప్రస్తుతం దుర్గం చెరువు వరకు వెళ్లాల్సి వస్తోందని, అందుకే మీరాలం చెరువు వద్ద సుమారు మూడు కిలోమీటర్ల మేర కేబుల్ బ్రిడ్జి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.వచ్చే ఎన్నికల నాటికి గౌలి గోడ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రో పనులను పూర్తి చేస్తామని, మెట్రోలో వచ్చి ప్రజలను ఓట్లు అడుగుతామని వ్యాఖ్యానించారు.నాగోల్ నుంచి ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, రాజేంద్రనగర్ మీదుగా శంషాబాద్ వరకు మెట్రోను విస్తరించే ప్రణాళిక ఉందని సీఎం వెల్లడించారు.

హైదరాబాద్‌లో లక్ష ఇందిరమ్మ ఇళ్లు….

హైదరాబాద్‌లో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని పేర్కొన్నారు.హిందువులు, ముస్లింలు కలిసికట్టుగా నడిస్తేనే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుందని సీఎం అన్నారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.

మూసీ అభివృద్ధిపై విమర్శలు…..

మూసీ రివర్‌ఫ్రంట్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అడ్డంకులు సృష్టిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మూసీ అభివృద్ధి ద్వారా నైట్ ఎకానమీని ప్రోత్సహించి, స్థానిక పేదలకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షాలు అడుగడుగునా అడ్డుకుంటున్నాయని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *