(హైదరాబాద్ న్యూస్ఇన్)
ఐపీఎల్ క్రికెట్ జట్లలో ఉత్తమ జాబితాలోని రెండు జట్లు హైదరాబాద్ లో తలపడుతుండడంతో నగరానికి ఐపీఎల్ ఫీవర్ పట్టుకుంది. ఈ సీజన్లో అద్భుతంగా రాణిస్తున్న అంతర్జాతీయ ఆటగాళ్లతో రెండు జట్లు టైటిల్ రేస్ లో నువ్వా , నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. శుక్రవారం ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ ను క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని అభిమానుల జేబులు గుల్ల చేసేందుకు సైబర్ చీటర్స్, బ్లాక్ లో టిక్కెట్లు అమ్ముకునే ముఠాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
సన్రైజర్స్ హైదరాబాద్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య పోరుకు ఉన్న విపరీతమైన క్రేజ్ను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. టికెట్ల కోసం అభిమానుల్లో ఉన్న డిమాండ్ను ఆసరాగా చేసుకుని, నకిలీ యాప్లు, వెబ్సైట్ల ద్వారా దోపిడీకి తెరలేపోతున్నట్లు పోలీసులు గుర్తించారు.

ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఐపీఎల్ టికెట్ల బుకింగ్కు సంబంధించి అనేక ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. అధికారిక టికెటింగ్ భాగస్వామి అయిన ‘డిస్ట్రిక్ట్’ (District) యాప్ను పోలిన రంగులు, లోగోలతో ఉన్న నకిలీ యాప్లను సృష్టించి, తక్కువ ధరకే టికెట్లు ఇస్తామంటూ ఊరిస్తున్నారు. అసలు యాప్ను తలపించేలా ఉన్న ఈ నకిలీ లింకులను క్లిక్ చేసి టికెట్లు బుక్ చేసుకుంటే, సొమ్ము గల్లంతవ్వడం ఖాయమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
నకిలీ యాప్ ల ద్వారా
పేమెంట్ చేసిన తర్వాత టికెట్లు రాకపోగా, మీ బ్యాంకింగ్ వివరాలు కూడా సైబర్ నేరగాళ్ళు సేకరించే అవకాశం ఉంది తద్వారా బ్యాంక్ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ కూడా వారు మాయం చేసే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.ఎవరైనా ఇటువంటి ఫేక్ యాప్స్ లేదా వెబ్సైట్ల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు పిర్యాదు చేయాలి.
మరోవైపు ప్రతి మ్యాచ్ సందర్భంగా బ్లాకులో టికెట్లు అమ్ముకునే ముఠాలు కూడా ఈ మ్యాచ్ ద్వారా భారీగా సొమ్ము చేసుకోవాలని భావిస్తున్నాయి. టికెట్ల ధరలను విపరీతంగా పెంచి అభిమానుల జేబులు ఖాళీ చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో బ్లాక్ లో టికెట్లు అమ్ముకునే ముఠాలపై పోలీసులు ఇప్పటికే దృష్టి సారించారు.





Leave a Reply