అమాత్యుల అత్యుత్సాహాం సర్కార్ ను సవాళ్ల సుడిలో పడ్డట్లు చేసింది. గురుకుల టెండర్లు, జూపల్లి ప్రకటన కాంగ్రెస్ ను ఆత్మరక్షణలో వేసింది. గులాబీ నేతల దూకుడు వ్యూహం…కాంగ్రెస్ పార్టీ నేతలను ఇరుకు పెట్టింది.
తెలంగాణలో రాజకీయం అకస్మాత్తుగా వేడెక్కింది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఆరోపణలకు ఆకాశమే హద్దుగా మారింది. మొత్తం ఎపిసోడ్ లో కాంగ్రెస్ పార్టీ మంత్రుల అత్యుత్సాహం, తొందరపాటు వ్యాఖ్యలతో ప్రభుత్వం కాస్త ఆత్మరక్షణలో పడ్డట్టు కనిపిస్తోంది. మంత్రి జూపల్లి కృష్ణారావు.. కేటీఆర్, హరీష్ రావు లకు సవాల్ విసురుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల మీద బహిరంగ చర్చకు సిద్దమని, అందుకోసం తెలంగాణ భవన్ వేదికగా చర్చకు వస్తానని, అందుకు హరీష్ రావు, కేటీఆర్ సిద్దంగా ఉండాలని సవాల్ విసిరారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి పదునైన ఆయుధాన్ని స్వయంగా జూపల్లి కృష్ణారావే అందించినట్టైంది. జూపల్లి సవాల్ కు సిద్దమని చెప్తూ హరీష్ రావు, కేటీఆర్ తెలంగాణ భవన్ లో మంత్రి కోసం కుర్చీ వేసి మరీ ఎదురుచూస్తున్నట్టు మీడియాకు విజువల్స్ విడుదల చేసారు. మంత్రి జూపల్లి ఇక్కడ మరో ట్విస్ట్ ఇచ్చారు. ఒక్కొక్కరు కాదు ఇద్దరు కలిసి రావాలని కొత్త రాగం అందుకున్నారు. హరీష్ రావ్ గన్ పార్క్ కు వస్తారన్న సమాచారంతో జూపల్లి కూడా అక్కడకు చేరకుని కొత్త పల్లవి అందుకుని తన సవాల్ కు గులాబీ నేతలు తొకముడిచారని వ్యాఖ్యలు చేశారు.

ఈ మొత్తం తతంగం పరిశీలిస్తే….పకడ్బంధీ వ్యూహం లేకుండా సవాల్ విసరంతో ప్రభుత్వం అబాసుపాలవ్వడం తప్ప మరేముంటుందనే చర్చ రాజకీయంగా జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును తీసుకొస్తే ఎక్కడికైనా చర్చకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నామని మంత్రి జూపల్లి ప్రకటించి ఉంటే అసలు ప్రభుత్వానికి ఏమాత్రం డ్యామేజీ అయ్యి ఉండేది కాదు. కానీ సవాల్ పేరుతో ప్రతిపక్షం చేతులో జుట్టు పెట్టి ఎలా బయటపడాలా అన్న విధంగా జూపల్లి వ్యవహరించారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మరో ఎపిసోడ్ లో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాల టెండర్లలో అవినీతి జరిగిందంటూ, ఇదే అంశంపైన సోమాజీ గూడ ప్రెస్ క్లబ్ వేదికగా బహిరంగ చర్చకు సిద్దమా అంటూ సాంఘీక సంక్షేమ శాఖామంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు సవాల్ విసిరారు. దీంతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తో పాటు మైనారిటీ, బీసీ సంక్షేమ శాఖా మంత్రులు మహమ్మద్ అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్ కూడా స్పందించారు. సోమాజీ గూడ ప్రెస్ క్లబ్ కాకుండా గన్ పార్క్ అమరవీరుల స్థూపం దగ్గర చర్చకు సిద్దమని ఆర్ఎస్ ప్రవీణ్ కు ప్రతి సవాల్ విసిరారు. దీంతో ఈ రెండు అంశాలు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చిందా…అమాత్యకులు అత్యుత్సాహంతో విసిరిన సవాళ్ల అన్నది ఎవరికీ అంతుకు చిక్కలేదు.

తెలంగాణ భవన్ కు వస్తానని సవాల్ విసిరిన మంత్రి జూపల్లి కృష్ణరావు తర్వాత గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం దగ్గర ప్రత్యక్షం కావడంతో మరింత గందరగోళం నెలకొంది. ఇక గన్ పార్క్ లో మంత్రులు ఆర్ఎస్ ప్రవీణ్ విసిరిన సవాల్ మీద స్పందించకుండా హరీష్ రావు, కేటీఆర్ వ్యాఖ్యల మీద స్పందించారు ముగ్గురు మంత్రులు. దీంతో మంత్రుల్లో అయోమయం గందరగోళం తప్ప మరొకటి కనిపించలేదు. ఎవరి సవాల్ కు ఎవరు స్పందిస్తున్నారనే అంశం పట్ల స్పష్టత కరువయ్యింది. మరోపక్క రాష్ట్ర అప్పులపై వివారాలు అందించేందుకు సిద్దంగా ఉన్నామన్న హరీష్ రావు, కేటీఆర్ సవాల్ పట్ల ప్రజలకు స్పష్టత కనిపించింది. దీంతో ఈ రోజు జరిగిన సవాళ్లు ప్రతిసవాళ్లలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పైచేయి సాధించినట్టు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో గులాబీ పార్టీ పైచేయి సాధించిందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.
కృష్ణహరి. స్పెషల్ కరస్పాండెంట్,












Leave a Reply