NewsInn

News in a Click

రేవంత్ రెడ్డి కర్కోటక ముఖ్యమంత్రి

రేవంత్ రెడ్డి కర్కోటక ముఖ్యమంత్రి

(హైదరాబాద్,న్యూస్ఇన్‌)

రేవంత్ రెడ్డి కర్కోటక ముఖ్యమంత్రి అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గపు ప్రభుత్వమని అన్నారు. ధర్మసమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్, వెలుగుమట్ల ఇండ్ల కూల్చివేత బాధితులు, ట్రిపుల్ ఆర్ నిర్వాసితులు, పరిగి మండలం కడ్లాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ బాధితులతో కలిసి మంగళవారం లోక్ భవన్ లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో సమావేశం అయ్యారు. వెలుగుమట్లలో ఇండ్ల కూల్చివేతలు, ట్రిపుల్ ఆలైన్ మెంట్ మార్పులు, రాయగిరిలో ట్రిపుల్ ఆర్ కోసం భూసేకరణ, కడ్లాపూర్ లో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో పేదల భూములను లాక్కునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను గవర్నర్ కు వివరించారు. అనంతరం లోక్ భవన్ బయట మీడియాతో మాట్లాడారు. రేవంత్ సర్కార్ పేదలకు చేస్తున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని గవర్నర్ ను కోరామని చెప్పామన్నారు. తాము చెప్పిన అంశాలను గవర్నర్ ఒపోకతో విన్నారని, కచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.

రేవంత్ రెడ్డి కర్కోటక సీఎం….

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజల పట్ల అత్యంత కర్కోటకంగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని కవిత మండిపడ్డారు. కేవలం వంద రూపాయల చీర ఇచ్చి ఆడవాళ్లను కోటీశ్వరులు చేస్తున్నామంటూ ముఖ్యమంత్రి అబద్దాలు చెబుతున్నాడని విమర్శించారు. వెలుగుమట్లలో ఆడబిడ్డ నవ్య ఇల్లు కూలగొట్టి వారికి మనశ్శాంతి లేకుండా చేశారన్నారు. వెలుగుమట్ల లో ఇళ్లు కూల్చుతుంటే ఓ మహిళకు గర్భస్త్రావం అయ్యిందని..వాళ్ల భర్త రోదన ఇప్పటికీ మాకు వినబడుతూనే ఉందన్నారు. రాష్ట్రంలో ఏ రైతు కూడా సంతోషంగా లేడని చెప్పారు. వెంటనే రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని కవిత డిమాండ్ చేశారు.

న్యాయం చేస్తారన్న నమ్మకం ఉంది….

ఖమ్మంలోని వెలుగుమట్ల, పరిగిలోని ఇండస్ట్రీయల్ పార్క్ కోసం ల్యాండ్ కోల్పోతున్న బాధితులు, ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితుల కోసం తాము పోరాడుతున్న విషయం తెలిసిందేనని కవిత గుర్తు చేశారు. వారికి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో బాధితులను తీసుకెళ్లి గవర్నర్ ను కలిశామన్నారు. ట్రిపుల్ ఆర్ ఆలైన్ మెంట్ ను నాలుగు సార్లు మార్చిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఆశ్చర్యపోయారన్నారు. దీనికి సంబంధించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాసిన లేఖకు కూడా గవర్నర్ కు అందజేశామన్నారు. తాము చెప్పిన అంశాలను కూలంకషంగా విన్నారని కవిత చెప్పారు. ఆయా అంశాలకు సంబంధించి రిపోర్ట్ తెప్పించుకోని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. గవర్నర్ కచ్చితంగా న్యాయం చేస్తారన్న నమ్మకంతో ప్రజాస్వామ్య పద్దతిలో ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రభుత్వానికి కొన్ని రోజులు సమయం ఇచ్చి ఆ తర్వాత సమస్యలు పరిష్కారం కాకపోతే మళ్లీ పోరాట బాట పడతామని కవిత తేల్చి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *