రాజకీయాల్లో అందరు నాయకులు ఒకేలా ఉండరు. వారి ఆలోచనా విధానం కూడా ఒకేలా ఉండదు. వారి లక్ష్యాలు కూడా వేరువేరుగా ఉంటాయి. రాజకీయాల్లో ప్రజా సేవే పరమార్థం అయినప్పటికీ దాన్ని అందరు రాజకీయ నాయకులు అంకితభావంతో ఆచరించరు. కొంత మంది రాజకీయ నాయకులు మాత్రం మెలకువగా ఉన్నా, నిద్రలో ఉన్నా ప్రజా సేవ గురించే ఆలోచిస్తుంటారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అంచెలంచెలుగా నెరవేర్చే వరకూ వాళ్లు మనశ్శాంతి గా ఉండరు. అలాంటి అరుదైన రాజకీయ నేతల కోవకు చెందిన వాడే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి. అధికారం ఉన్నా లేకపోయినా, ఎమ్మెల్యేగా గెలిచినా గెలవకపోయినా సంగారెడ్డి నియోజక వర్గానికి అనూహ్య సేవలందిస్తూ, సంగారెడ్డి ప్రజలకు తలలో నాలుకలా వ్యవహరిస్తుంటారు జగ్గారెడ్డి.

ఇక అభివృద్ది విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా వేగవంతమైన అభివృద్దికి బాటలు వేస్తున్నారు జగ్గారెడ్డి. ఒక్క అభివృద్దే ఎజెండా కాకుండా కష్టాల్లో ఉన్న పేద ప్రజానీకానికి, వివిధ రకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్న రోగులకు, పేద విద్యార్థులకు నేనున్నానంటూ ఆర్ధిక సాయం చేస్తూ విశాల హృదయాన్ని చాటుకుంటున్నారు జగ్గారెడ్డి. అంతే కాకుండా సంగారెడ్డి నియోజక వర్గంలో రోడ్ల నిర్మాణం, చెరువుల సుందరీకరణ, పార్కుల అభివృద్ధి, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం, నీటి సరఫరాకు ప్రత్యేక లైన్లు, బడులకు మరమ్మత్తులు, ప్రార్థనా మందిరాల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పన అంశంలో శక్తివంచన లేకుండా శ్రమిస్తుంటారు జగ్గారెడ్డి. ఒక రకంగా చెప్పాలంటే నియోజకవర్గ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటారు జగ్గన్న. కోవిడ్ సమయంలో ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా అంశంలో దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తున్నారు జగ్గారెడ్డి.

జగ్గన్న రాజకీయ ప్రయాణం ఒకసారి చూస్తే 2004లో టీఆర్ఎస్ పార్టీ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత రెండోసారి 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున సంగారెడ్డి నుంచి అనూహ్య విజయం సాధించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోటరీలో ప్రభుత్వ విప్ గా పనిచేసారు జగ్గారెడ్డి. కొన్ని ప్రత్యేక కారణాలు, రాష్ట్ర విభజన అంశం వల్ల 2014లో సంగారెడ్డి నుంచి ఓడిపోయారు. 2018 లో కాంగ్రెస్ పార్టీ తరఫున సంగారెడ్డి నియోజకవర్గం నుంచి మూడోసారి శాసనసభ్యుడిగా విజయం సాధించారు. తర్వాత 2023 సాధారణ ఎన్నికల్లో మళ్లీ ఓటమి చవిచూశారు. ఈ ఓటమి జగ్గారెడ్డిని బాగా బాధ పెట్టినట్లు తెలుస్తోంది. స్వయంగా రాహుల్ గాంధీ తన భుజం మీద చేయి వేసి జగ్గారెడ్డిని గెలిపించుకోవాలని సంగారెడ్డి ప్రజలకు స్వయంగా విజ్ఝప్తి చేసినా ప్రజలు ఓడించారని, ఇది చాలా బాధాకరమని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. అంతే కాకుండా రాబోవు ఎన్నికల్లో తాను సంగారెడ్డి నుంచి పోటీ చేయనని, తన భార్య నిర్మలను పోటీ చేయిస్తానని సాహసోపేతంగా ప్రకటించారు జగ్గారెడ్డి. ఓటమికి సంబంధించిన భాధను మునిపంటిన బిగించి చిరునవ్వుతో సంగారెడ్డి నియోజక వర్గ అభివృద్దికి అలుపెరగని పోరాటం చేస్తున్న ఏకైక రాజకీయ నాయకుడు జగ్గారెడ్డి. అధికారులను, మంత్రులను సమన్వయం చేసుకుంటూ సంగారెడ్డికి కావాల్సిన నిధులను సమకూర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు జగ్గారెడ్డి. ఈ పరంపరలో నిరుపేదల చిరు వ్యాపారాలు, పేదల నివాసాలకు హాని కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ అధికారులకు ముందస్తు జాగ్రత్తలు పురమాయిస్తుంటారు జగ్గారెడ్డి. అభివృద్ది, రోడ్ల విస్తరణ పేరుతో చిరు వ్యాపారుల జీవనాధారాన్ని మృగ్యం చేయరాదన్న లక్ష్యంతో అధికారులకు తగు సూచనలు, సలహాలు ఇస్తుంటారు జగ్గారెడ్డి. అధికారంలో ఉన్నా లేకపోయినా, పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజాసేవే పరమావధిగా ముందుకు వెళ్తుంటారు జగ్గారెడ్డి.

జగ్గారెడ్డి పనితీరు సహచర ఎమ్మెల్యేలకు స్ఫూర్తి వంతంగా ఉంటుందనడంలో ఆశ్చర్యం ఉండదు. అంకిత భావంతో పనిచేసే ఏ రాజకీయ నాయకుడైనా ఇతర నేతలకు ఆదర్శంగా నిలుస్తుంటారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి చేస్తుంది కూడా అదే. చిన్నారులకు సైకిళ్ల పంపిణీ దగ్గర నుండి క్యాన్సర్ రోగులకు ఆర్ధిక సాయం అందించే వరకూ అన్నీ దగ్గరుండి చూసుకుంటారు జగ్గారెడ్డి. శ్రీరామ నవమి సందర్భంగా రాముని కళ్యాణ వేడుకలు, మహాశివరాత్రి సందర్భంగా మహా శివుని జాగరణ కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహిస్తుంటారు జగ్గారెడ్డి. సినీ నేపథ్య సంగీత కళాకారులు, గాయనీ గాయకులు, ఇతర నటీ నటులతో భక్తి సంగీత విభావరి, ప్రత్యేక నాటకాలు నిర్వహించి ఊరంతా ఆధ్యాత్మిక శోభను నింపుతారు జగ్గారెడ్డి. హిందూ పర్వదినాలకే కాకుండా ముస్లిం, క్రిస్టియన్ పండుగలకు ఆయా ప్రజలకు పెద్ద ఎత్తున ప్రేరణ అందిస్తారు. రంజాన్, క్రిస్మస్ సందర్భంగా ముస్లిం, క్రిస్టియన్ సోదరులకు ప్రత్యేక బహుమతులను, ఆర్థిక సహాయం అందిస్తారు జగ్గన్న. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ భిన్న సంస్కృతుల సమాహారంగా సంగారెడ్డి నియోజక వర్గంలోని ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకుంటారు జగ్గారెడ్డి. కొన్ని కొన్ని సందర్భాల్లో భావోద్వేగానికి లోనై అధికారుల పైన, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ తర్వాత వారితో స్నేహ పూర్వకంగా, సోదరభావంతో ముందుకు కలుపుకుపోతుంటారు జగ్గన్న.

నియోజకవర్గం అన్న తర్వాత రకరకాల ప్రజలు, రకరకాల ఎన్నికలు, రకరకాల అధికారులు, అనేక రకాల నిబంధనలు ఉంటాయి. ఇవన్నింటిని సమతుల్యం చేసుకుంటూ ముందుకు వెళ్తుంటారు జగ్గన్న. నియోజక వర్గంలోని నిరుపేదలకే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలతో కలిపి దేశంలో ఎవరు సహాయం కోసం జగ్గన్న ఇంటికి వెళ్లినా కాదనలేని మంచి మనసు జగ్గన్న సొంతం. ఎదుటి వాడు నిజంగా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చలించిపోయి సత్వర సాయం చేసే మంచి గుణం జగ్గన్నది. జగ్గారెడ్డి ఎమ్మెల్యే కాకపోయినా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ పదవుల కోసం ఏనాడూ ఢిల్లీ వెళ్లిన సందర్భాలు లేవు. తనకోసం, తన పదవి కోసం లాబీయింగ్ రాజకీయం ఏనాడూ చేయలేదు జగ్గారెడ్డి. నిన్నటికి నిన్న ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ను సంప్రదించింది కూడా సీనియర్ నాయకుడు టీ జీవన్ రెడ్డి కి రాజ్యసభ ఇచ్చి గౌరవించుకోవాలనే ప్రతిపాదన చేసారు తప్ప, తన రాజకీయ అవకాశాల కోసమో, పదవుల కోసమో కాదన్నది అక్షర సత్యం. రాజకీయాల్లో ఇంత పారదర్శకత, నిజాయితీ ఉన్న ఏకైక నాయకుడు జగ్గారెడ్డి. ఇలాంటి అరుదైన, మంచి మనసున్న జగ్గారెడ్డి జన్మదిన సందర్బంగా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, జగ్గన్నకు.. జగ్గన్న తో పాటు ఆయన కుమార్తె జయారెడ్డి పుట్టినరోజు కూడా ఒకే రోజు కావడంతో ఇద్దరికీ న్యూస్ఇన్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు
కృష్ణహరి, సీనియర్ కరస్పాండెంట్,













Leave a Reply