NewsInn

News in a Click

కాళేశ్వ‌రంపై అసెంబ్లీలో చ‌ర్చిద్దాం రా…..!

కాళేశ్వ‌రంపై అసెంబ్లీలో చ‌ర్చిద్దాం రా…..!

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై అసెంబ్లీలో చ‌ర్చించేందుకు మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రావాల‌ని సీఎం రేవంత్ రెడ్డి స‌వాల్ విసిరారు. అసెంబ్లీ తేదీల‌ను కూడా కేసీఆర్ ఖరారు చేసి స్పీక‌ర్ కు లేఖ రాయాల‌ని సూచించారు. కేసీఆర్ గౌర‌వానికి భంగం క‌లుగ‌కుండా అసెంబ్లీ నిర్వ‌హించే బాధ్య‌త మాద‌ని ప్ర‌క‌టించారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో బీఆర్ ఎస్ త‌ప్పిదాల‌ను క‌ప్పిపుచ్చుకునే య‌త్నాలు చేస్తోంద‌ని ఆరోపించారు. ప్ర‌జాభ‌వ‌న్ లో కాళేశ్వ‌రం పై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ సంద‌ర్భంగా సీఎం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

గోదావరి జలాలను తరలించి తెలంగాణను సస్య శ్యామలం చేయాలని కాంగ్రెస్ మొదటి నుంచి ప్రయత్నించిందని,39 వేల కోట్ల అంచనాతో మొదలైన ఈ ప్రాజెక్టు తెలంగాణ ఏర్పడే నాటికి 6150 కోట్లు ఖర్చు చేశార‌ని తెలిపారు. ఆ త‌రువాత ప్రాజెక్టు రీడిజైన్ కోసం క‌మిటీ వేసింద‌ని, మేడిగ‌డ్డ వ‌ద్ద బ్యారేజీ వ‌ద్ద‌ని క‌మిటీ నివేదిక ఇచ్చింద‌న్నారు. వ్యాప్కోస్ ద్వారా గ‌త ప్ర‌భుత్వం త‌మ‌కు కావాల్సిన నివేదిక‌ను తెప్పించుకుంద‌న్నారు. కమిషన్ల కోసం ప్రాజెక్టును మార్చి, పేరు మార్చి 38 వేల కోట్ల నుంచి అంచనాలు 81 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. నీళ్లు, ఆయకట్టు పెరగ‌క పోయినా….… కానీ అంచనాలు మాత్రం పెరిగాయన్నారు.

ప్లానింగ్, డిజైన్, నిర్మాణం, ఆపరేషనల్ మెయింటెనెన్స్ నాణ్యతగా చేసి ఉంటే ఇవాళ ఇలాంటి పరిస్థితి రాకపోయేదని సీఎం వ్యాఖ్యానించారు. గోదావరి ఉధృతితో గోడ నాణ్యత లేకపోవడం వల్ల కన్నెపల్లి పంప్ హౌస్ 2022 లోనే మునిగిపోయిన విష‌యాన్ని సీఎం గుర్తు చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కట్టిన చోట ఎలాంటి భూ పరీక్షలు చేయలేదన్నారు. లక్ష కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టును ఎలాగైనా నిలబెట్టాలని మేం ప్రయత్నిస్తున్నాంమ‌ని సీఎం చెప్పారు. కాళేశ్వరం పేరుతో లక్ష 2 వేల కోట్లు ఖర్చు చేస్తే మీరు చేసిన నిర్వాకం ఏమిటని బీఆర్ ఎస్ నేత‌ల‌ను ప్ర‌శ్నించారు. బీఆర్ ఎస్ చేసిన త‌ప్పుల‌కు ఉరి తీయాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నా…నిబంధ‌న‌లు అడ్డువ‌స్తున్నాయ‌ని సీఎం వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *