NewsInn

News in a Click

బ్రిక్స్ స‌ద‌స్సు ఏర్పాట్ల‌పై స‌ర్కార్ ఫోక‌స్

బ్రిక్స్ స‌ద‌స్సు ఏర్పాట్ల‌పై స‌ర్కార్ ఫోక‌స్

(హైదరాబాద్, న్యూస్ఇన్‌)

ఆగస్టు 4, 5 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సమీక్ష నిర్వహించారు.సచివాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సదస్సు విజయవంతంగా నిర్వహించేందుకు వివిధ శాఖల మధ్య సమన్వయంపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు భారత ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు. 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశానికి బ్రిక్స్‌ లోని 11 సభ్య దేశాల నుంచి సుమారు 40 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరుకానున్నారు. అదనంగా, భారత ప్రభుత్వానికి చెందిన సుమారు 40 మంది సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొని చర్చల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం (DoPT) సంయుక్త కార్యదర్శి సుశీల్ కుమార్ పటేల్ సమావేశ నిర్వహణకు సంబంధించిన అంశాలపై సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు.

సమావేశం సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాన్ని వివరిస్తూ భద్రతా ఏర్పాట్లు, పారిశుద్ధ్యం, వైద్య, అత్యవసర వైద్య సేవలు, రవాణా, ప్రోటోకాల్, వసతి, సమావేశ వేదిక నిర్వహణతో పాటు ఇతర లాజిస్టిక్ ఏర్పాట్లలో సహకారం అందించాలని కోరారు.ఏర్పాట్లను సమీక్షించిన ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సంబంధిత అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి ముందస్తుగా సమగ్ర ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశానికి పటిష్టమైన భద్రత, సమర్థవంతమైన రవాణా, ట్రాఫిక్ నిర్వహణ, అత్యున్నత స్థాయి పారిశుద్ధ్యం, తగిన వైద్య సదుపాయాలు, అంతరాయం లేని పౌర సేవలు, సంబంధిత అన్ని విభాగాల మధ్య సమర్థవంతమైన సమన్వయం ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందజేస్తామని ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హామీ ఇచ్చారు. సమావేశం విజయవంతంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం భారత ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించడంతో పాటు ప్రతినిధుల సౌకర్యం, భద్రత, సౌలభ్యానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *