(హైదరాబాద్,న్యూస్ఇన్)
అందెశ్రీ.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు కవిగా, గాయకుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా పరిచయం ఉండొచ్చు.. కానీ నాకు మాత్రం ఉద్యమకారుడే కాదు.. అందెశ్రీ నాకు ఒక ఆత్మబంధువు” అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన గానంలో ఉన్న గొప్పతనం, గళంలో ఉన్న స్ఫూర్తి.. ఈనాడు నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నానంటే… ఆ స్ఫూర్తి నాలో రగిల్చిన మాట నిజం.. అని భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. అందెశ్రీ జయంతి సందర్భంగా ఘట్కేసర్లో వారి స్మృతి వన నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అందెశ్రీ కి పుష్పాంజలి ఘటించారు. భార్య మల్లుబాయి , కుమార్తెలు వాక్కులమ్మ, వెన్నెల, వేకువ కుమారుడు దత్తుల సమక్షంలో స్మతివన నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమి పూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “కవి, గాయకుడు, ఉద్యమకారుడు.. నాకు ఆత్మబంధువుగా మారాడు. నా కుటుంబ సభ్యుడయ్యారు. మా కుటుంబంలో మేం ఏడుగురం అన్నదమ్ములం. నేను నాలుగో వాడిని. నాకు మా పెద్దన్ననే స్పూర్తి. తమ్ముడు ఒక స్థాయిలో ఉండాలని మా అన్న ఎన్నో కలలు గన్నడు. నేను ఎదుగుతున్న క్రమంలో నేను మా అన్నను కోల్పోయా. ఆ తర్వాత నాకు కనిపించిన పెద్దన్న అందెశ్రీ” అని చెప్పారు. అందెశ్రీ స్పూర్తి మన గుండెల్లో నిత్యం కొలువై ఉంటుంది. ఒక స్ఫూర్తి ప్రదాతగా అందెశ్రీ అందరి గుండెల్లో ఉంటారు. అందెశ్రీ స్ఫూర్తే ప్రజా ప్రభుత్వానికి శ్రీరామ రక్ష. అందెశ్రీ, గద్దర్ స్ఫూర్తితో ప్రభుత్వం ఉంటుంది” అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో రెక్కలు ముక్కలు చేసుకొని.. గొంతుని, జీవితాలను ఉద్యమానికి అంకితం చేసిన 9 మందిని గుర్తించి .. పార్టీని, జెండాను చూడకుండా.. సత్కరించి ప్రతి కుటుంబానికి రూ. కోటి అందజేశాం. ఇది నా సొమ్ము కాదు. ప్రజల సొమ్ము అని చెప్పారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం 2024 జూన్ 2వ తేదీన జయ జయహే తెలంగాణ.. గీతాన్ని రాష్ట్ర గీతంగా జాతికి అంకితం చేసిన సందర్భంలో అందెశ్రీ భావోద్వేగానికి లోనైన సందర్భాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు.












Leave a Reply