(న్యూస్ఇన్, హైదరాబాద్ )
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫర్టిలిటీ, ఐవీఎఫ్ సేవలను మరింత విస్తరించడంతో పాటు, ప్రైవేట్ ఫర్టిలిటీ సెంటర్లలో ఏఆర్టీ, సరోగసి చట్టాల అమలును కట్టుదిట్టం చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే సెంటర్లపై ఎలాంటి ఉపేక్ష లేకుండా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ప్రభుత్వ, ప్రైవేట్ ఫర్టిలిటీ, ఐవీఎఫ్ సెంటర్ల పనితీరు, ఏఆర్టీ, సరోగసి చట్టాల అమలు, పీసీపీఎన్డీటీ యాక్ట్ అమలుపై మంత్రి సోమవారం సచివాలయంలో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా గాంధీ హాస్పిటల్, పేట్లబుర్జు హాస్పిటల్లోని ప్రభుత్వ ఐవీఎఫ్ సెంటర్ల పనితీరును సమీక్షించారు. ఈ రెండు కేంద్రాల్లో ఇప్పటివరకు కలిపి 39,802 మంది పేషెంట్లకు ఫర్టిలిటీ వైద్య సేవలు అందించినట్లు అధికారులు తెలిపారు. 20,185 ఫాలిక్యులర్ స్టడీలు, 521 ఐయూఐ ప్రక్రియలు, 545 ఐవీఎఫ్ కేసులు నిర్వహించినట్లు వివరించారు.గాంధీ హాస్పిటల్లో ఐవీఎఫ్ సెంటర్ను 2024 అక్టోబర్లో, పేట్లబుర్జులోని ఎంజీఎంహెచ్లో ఐవీఎఫ్ సెంటర్ను 2024 డిసెంబర్లో ప్రారంభించారు. ఈ కేంద్రాల్లో సేవలను మరింత బలోపేతం చేయడంతో పాటు జిల్లాల్లోనూ దశలవారీగా ఐవీఎఫ్ సేవలను విస్తరించేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు.
రాష్ట్రంలో 477 ఏఆర్టీ, సరోగసి సెంటర్లు…..
రాష్ట్రంలో ప్రస్తుతం 477 ఏఆర్టీ, సరోగసి సెంటర్లురిజిస్టర్ అయి ఉన్నాయని అధికారులు తెలిపారు. వీటిలో 129 ఏఆర్టీ లెవల్-1, 226 ఏఆర్టీ లెవల్-2, 59 ఏఆర్టీ బ్యాంకులు, 63 సరోగసి క్లినిక్లు ఉన్నట్లు వివరించారు.
ఏఆర్టీ, సరోగసి చట్టాలకు అనుగుణంగా సెంటర్ల కార్యకలాపాలు సాగుతున్నాయా లేదా అన్నది నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి సూచించారు.

379 సెంటర్ల తనిఖీ.. …
ప్రైవేట్ ఫర్టిలిటీ సెంటర్లలో అధికారులు నిర్వహించిన తనిఖీలపై మంత్రి ఆరా తీశారు.
379 సెంటర్లను తనిఖీ చేయగా 50 సెంటర్లలో నిబంధనలను పాటించలేదని గుర్తించినట్లు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యానారాయణ తెలిపారు.సిబ్బంది మార్పు, రికార్డుల నిర్వహణలో లోపాలు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ప్రదర్శించకపోవడం, గ్రీవెన్స్ సెల్ నిర్వహించకపోవడం, రిజిస్ట్రేషన్లో ఉన్న చిరునామాకు భిన్నంగా మరోచోట సెంటర్ నిర్వహించడం వంటి ఉల్లంఘనలు గుర్తించినట్లు వివరించారు. ఆయా సెంటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, ఉల్లంఘనల తీవ్రతను బట్టి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.ఫర్టిలిటీ సేవల పేరుతో పేషెంట్లపై అనవసర ఆర్థిక భారం పడకుండా పారదర్శకంగా సేవలు అందేలా చూడాలని మంత్రి ఆదేశించారు. సెంటర్లలో వినియోగించే మందులు, ఇంజక్షన్లు, తయారీ సంస్థలు, ఎంఆర్పీ తదితర అంశాలను కూడా తనిఖీల్లో పరిశీలించాలని సూచించారు.
పీసీపీఎన్డీటీ చట్టంపై ప్రత్యేక నిఘా….
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు హాస్పిటళ్లు, స్కానింగ్ సెంటర్లలో 2,600 సెంటర్లు తనిఖీ చేసి 52 సెంటర్లలో 37 డీవియేషన్స్ గుర్తించి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు వివరించారు. లింగ నిర్ధారణకు పాల్పడే అవకాశమున్న కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని, పీసీపీఎన్డీటీ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని మంత్రి ఆదేశించారు.ప్రభుత్వ రంగంలో ఫర్టిలిటీ, ఐవీఎఫ్ సేవలను విస్తరించడంతో పాటు, ప్రైవేట్ రంగంలో నాణ్యతా ప్రమాణాలు, పారదర్శకత, చట్టబద్ధతను నిర్ధారించేలా పర్యవేక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని దామోదర్ రాజనర్సింహ అధికారులకు సూచించారు.












Leave a Reply