(న్యూస్ఇన్,హైదరాబాద్)
తెలంగాణాలో మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ అసెంబ్లీ సమావేశాలకు ముందే అవుతుందా….అసెంబ్లీ సమావేశాల తరువాత ఉంటుందా అన్నది రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. మంత్రి వర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయడంతో మొత్తం మూడు స్థానాలను భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ మూడు స్థానాల భర్తీకి నేతల్లో భారీగా ఆశలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం మంత్రి వర్గంలో ఉన్న మరికొందరిని కూడా తొలగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరో ఇద్దరు లేదా ముగ్గురిని తొలగించి 5 లేదా ఆరు కొత్త ముఖాలకు క్యాబినెట్లో చోటు కల్పించాలన్న అభిప్రాయంతో సీఎం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై దాదాపు మూడేళ్లు అవుతుండడంతో…మరో రెండేళ్లలో ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎన్నికల టీం ను సిద్ధం చేసుకోవాలంటే ఇదే సరైన సమయమని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమచారం.
అందులో భాగంగా పార్టీలో క్రమశిక్షణ తో నేతలు వ్యవహరించాలన్న ఉద్దేశ్యంతో సీఎం మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేసినట్లు చెబుతున్నారు. కొండా బర్తరఫ్ తో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ లో అసమ్మతి రాగాన్ని బహిరంగంగా వినిపించకుండా కట్టడి చేసే వ్యూహాన్ని సీఎం రేవంత్ అనుసరిస్తున్నారు. ఈ విషయంలో హై కమాండ్ తో పట్టు బట్టి మరీ కొండా ను బర్తరఫ్ చేయడంలో సీఎం విజయవంతం కావడంతో…… మరికొంత మంది నేతల్లో ఈ వ్యవహారం కొంత ఆత్మరక్షణలో వేసే విధంగా మారింది. కొండా సురేఖతో పాటు సీనియర్ నేత చిన్నారెడ్డిపైనే పార్టీ ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నారు. చిన్నారెడ్డితో సీఎంకు వ్యక్తిగత అనుబంధం ఉన్నా…క్రమశిక్షణ కు కట్టుబడి ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలు సీఎం ఇచ్చారు.


ఇక క్యాబినెట్ కూర్పుపైనా ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆర్ధిక శాఖ మంత్రిగా ఉన్న భట్టి విక్రమర్కను ఆ శాఖ నుంచి తప్పించాలని సీఎం భావిస్తున్నా…. భట్టి మాత్రం ఆర్ధిక శాఖను వదులుకునేది లేదని పార్టీ హై కమాండ్ ముందు స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు మంత్రి పదవులు ఇప్పటికీ ఈ నేపథ్యంలో ఆ మూడు జిల్లాల్లో ఎవరికి పదవులు వరిస్తాయన్నది ఆసక్తి రేపుతోంది. స్పీకర్ గా ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్ ను మంత్రి వర్గంలో కి తీసుకుని స్పీకర్ పదవిని మరో నేతకు అప్పగించే అవకశం ఉన్నట్లు తెలుతోంది. మంత్రి వర్గంలో చోటు దక్కించుకోవాలని ఉవ్శిళ్లూరుతున్న మల్ రెడ్డి రంగారెడ్డి, రాంమోహన్ రెడ్డిలకు ఇతర పదవులు కట్టబెట్టే చాన్స్ ఉందని తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న సుదర్శన్ రెడ్డికి క్యాబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంది. కానీ సామాజిక సమీకరణల నేపథ్యంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

పీసీసీ చీఫ్ గా ఉన్న మహేష్ గౌడ్ ను క్యాబినెట్లో చేర్చుకునే చాన్స్ ఉందని అంటున్నారు. దీంతో పాటు బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనీల్ పేరు కూడా చర్చకు వస్తోంది. పునర్వ్యస్థీకరణలో మంత్రి గా అవకాశం కల్పించి మండలి సభ్యుడిగా ప్రభుత్వం నామినేట్ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కొండా సురేఖ సామాజిక వర్గం కావడంతో అనిల్ కు ప్రాధాన్యత దక్క వచ్చని అంటున్నారు. అయితే….. మహిళ స్థానంలో మరో మహిళకు అవకాశం కల్పించాలని భావిస్తే విజయశాంతికి మంత్రి పదవి దక్కే చాన్స్ ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో పునర్వ్యస్థీకరణ ఆదివారం రోజు ఉంటుందన్న ప్రచారం ఉంది….కానీ అసెంబ్లీ సమావేశాల అనంతరమే మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ ఉంటుందని కూడా అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల క్రితం గవర్నర్ ను కలిసి కొండా రాజీనామా కు ఆమోదం పొందేలా చూడడంతో పాటు పునర్వ్యస్థీకరణ పై గవర్నర్ కు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.












Leave a Reply