(న్యూస్ఇన్, హైదరాబాద్)
సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు డిమాండ్ చేశారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు సాగించిన పోరాటంలో పరకాల అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు.పరకాల అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఎనభై ఏళ్ల క్రితం రజాకార్లు పరకాల ప్రాంతంలో సాగించిన మారణకాండ దక్షిణ భారత జలియన్వాలాబాగ్ను తలపించిందన్నారు. చాపలబండ వద్ద 19 మందిని, సమీపంలోని లక్ష్మీపూర్లో మరో ముగ్గురిని హతమార్చారని, పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని గుర్తుచేశారు. గుండ్రాంపల్లి, బైరాన్పల్లి ఘటనలు నాటి నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు.
సర్దార్ వల్లభభాయ్ పటేల్ చేపట్టిన ఆపరేషన్ పోలోతో నిజాం పాలనకు ముగింపు పలికిందని, 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందని రాంచందర్ రావు తెలిపారు. పీవీ నరసింహారావు, స్వామి రామానంద తీర్థ, వందేమాతరం రామచంద్రరావు, షోయబుల్లా ఖాన్, తుర్రేబాజ్ ఖాన్ తదితరులు విలీన పోరాటంలో కీలక పాత్ర పోషించారన్నారు.

సెప్టెంబర్ 17 నిర్వహణపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వైఖరిని ఆయన తప్పుబట్టారు. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగానే విమోచన పోరాట చరిత్రను అధికారికంగా గుర్తించడం లేదని ఆరోపించారు. మహారాష్ట్ర, కర్ణాటకలో సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తున్నప్పుడు తెలంగాణలో ఎందుకు నిర్వహించరని ప్రశ్నించారు.
బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చి భావితరాలకు అందిస్తామన్నారు. సెప్టెంబర్ 17న ప్రతి పల్లె, విద్యాసంస్థలో జాతీయ జెండా ఎగురవేసి అమరవీరులకు నివాళులు అర్పించాలని పిలుపునిచ్చారు.












Leave a Reply