(న్యూస్ఇన్,హైదరాబాద్)
హకీంపేటలో నిర్మిస్తున్న ఎడ్యుకేషన్ హబ్ పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఎడ్యుకేషన్ హబ్లో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ప్రభుత్వ మెడికల్, నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీలు, 430 పడకల ఆసుపత్రి తో పాటు ఇతర నిర్మాణాల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
హబ్లో చేపడుతున్న అన్ని నిర్మాణ పనుల్లో సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. నిర్మాణాల నాణ్యత విషయంలో రాజీ పడకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని, సాంకేతిక అంశాలపై నిపుణుల సూచనలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

వర్షాకాలంలో ఎడ్యుకేషన్ హబ్లో నీరు నిలిచిపోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. ఇందుకోసం వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేయడంతో పాటు, వర్షపు నీటిని ఒడిసిపట్టి భవిష్యత్లో ల్యాండ్స్కేపింగ్ పనులకు వినియోగించుకునేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కొడంగల్ నియోజకవర్గంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై సీఎం సమీక్ష నిర్వహించారు. గత సమీక్షలో ఇచ్చిన సూచనలకు అనుగుణంగా మక్తల్–నారాయణపేట్–కొడంగల్ ఎత్తిపోతలకు సంబంధించి పంప్హౌస్ పనులపై అధికారులు సీఎంకు వివరించారు.ఈ పథకంలో ఫేజ్-2 పనులకు వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు. ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచేందుకు ప్రతి ఏడాది అవసరమయ్యే బడ్జెట్కు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని సూచించారు.

పెండింగ్లో ఉన్న భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఫేజ్-1 పనులను 2027 డిసెంబర్ నాటికి, ఫేజ్-2 పనులను 2028 అక్టోబర్ నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.నియోజకవర్గంలో ఆర్అండ్బీ శాఖ పరిధిలో జరుగుతున్న రోడ్లు, భవనాలు, వంతెనలు, ఇతర మౌలిక వసతుల పనుల పురోగతిని సీఎం సమీక్షించారు. నియోజకవర్గంలో ప్రతి తండాకు రోడ్డు కనెక్టివిటీ ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తండాలకు రోడ్ల నిర్మాణంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై అక్కడికక్కడే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతకు ముందు మద్దూరు, దౌల్తాబాద్ మండలాల్లో సీఎం పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో విద్యాసంస్థలతో పాటు ఇతర అభివృద్ధి పనులను పరిశీలించారు.












Leave a Reply