(న్యూస్ఇన్,హైదరాబాద్)
తెలంగాణా రాజకీయాల్లో వివాదాస్పద మహిళా నేతగా గుర్తింపు ఉన్న కొండా సురేఖకు మంత్రి పదవి కలిసి వచ్చేలా కనిపించడం లేదు. ఇప్పటికీ రెండు సార్లు మంత్రి పదవి వరించినా…. పూర్తి కాలం మంత్రిగా కొనసాగలేకపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒక సారి…తెలంగాణాలో ఒక సారి ఐదేళ్ల పాటు మంత్రిగా కొనసాగకుండానే తన పదవిని పోగుట్టుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో స్వచ్ఛందంగా మంత్రి పదవి వదులు కోగా….ప్రత్యేక రాష్ట్రంలో కూతురు చేసిన వ్యాఖ్యలకు కొండా సురేఖ బలయ్యారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా మురళి, కొండా సురేఖల రాజకీయం గ్రామ స్థాయి నుంచి మొదలైంది. ఇప్పటికీ ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె రెండు సార్లు క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుచరుడిగా కొండా మురళికి పేరుంది. తనను నమ్ముకున్న వారి కోసం కొండా కుటుంబం ఎవరిపైనా పోరాటం చేసేందుకు వెనుకడుగు వేయరన్న ప్రచారం కూడా ఉంది.

దీంతో రాజకీయాల్లో ఆ కుటుంబానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి 1999లో తొలిసారి శాయంపేట ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004 లో మరోసారి అక్కడి నుంచి గెలుపొందారు. 2009 లో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం పరకాల నియోజకవర్గం నుంచి గెలుపొంది మూడోసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ బాధ్యతలు చేపట్టడంతో మంత్రి పదవి దక్కించుకున్నారు. అనూహ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతి చెందడంతో వైఎస్ జగన్ కు అండగా నిలిచారు. ఈ సమయంలో సీనియర్ నేత కొణిజేటి రోషయ్యను సీఎం పదవిని చేపట్టినట్లయితే తాను ఆ మంత్రి వర్గంలో కొనసాగనని ముందుగానే ప్రకటించారు. కానీ హై కమాండ్ రోషయ్యకు సీఎం పదవి కట్టబెట్టడంతో స్వచ్ఛందంగానే మంత్రి వర్గం నుంచి వైదొలిగి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. తెలంగాణా ఉద్యమ సమయం కావడంతో ఆ స్థానాన్ని కొండా సురేఖ కోల్పోవాల్సి వచ్చింది.

ఆ తరువాత మారిన పరిణామాలతో 2014 ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గులాబీ పార్టీలో ఉన్నన్ని రోజులు కూడా అసంతృప్తిగానే ఉన్నారు. రెండు అసెంబ్లీ స్థానాలు తమ కుటుంబానికి ఇవ్వాలని గులాబీ పార్టీలో ఆమె చేసిన డిమాండ్ ను ఆ పార్టీ పట్టించుకోకపోవడంతో…… గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ పై విమర్శలు చేసి 2018 ఎన్నికల నాటికి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి ఓటమి ఎదుర్కొన్నారు. ఆ తరువాత 2023 ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజవర్గం నుంచి పోటీ చేసి మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. సామాజిక సమీకరణల్లో భాగంగా కొండా సురేఖకు క్యాబినెట్లో చోటు దక్కింది.
బీఆర్ ఎస్ లో ఉన్న ఐదేళ్ల పాటు కూడా ఆ పార్టీ లోనే ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావ్, కడియం శ్రీహరి లాంటి నేతలతో నిత్యం విబేధాలతో గడపాల్సి వచ్చింది. మంత్రిగా అవకాశం దక్కినా….. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి సహా జిల్లా నేతలతో విబేధిస్తూ….వివాదాస్పదంగా మారారు. పరకాల టికెట్ కోసం కొండా కూతురు సుష్మిత సీఎం రేవత్ రెడ్డి సహా ఎమ్మెల్యే రేవూరిపై ఘాటుగా విమర్శలు చేయడంతో కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలను సీరియస్ గా పరిగణలోకి తీసుకుని మంత్రి వర్గం నుంచి తొలగించింది. దీంతో రెండు సార్లు మంత్రి పదవి దక్కించుకున్నా….. మిగిలిన నేతలతో పాటు ముఖ్యమంత్రులను విబేధించి మంత్రి పదవులను కొండా సురేఖ కోల్పోవాల్సి వచ్చింది.












Leave a Reply