(న్యూస్ఇన్,కరీంనగర్)
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో యువత, విద్యార్థులను పూర్తిగా విస్మరించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిరుద్యోగులను మోసం చేసిందని విమర్శించారు. కరీంనగర్లో నిర్వహించిన యువ సదస్సులో మాట్లాడిన ఆయన.. యువత మరోసారి ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రకటించిన యూత్ డిక్లరేషన్పై తీవ్ర స్థాయిలో స్పందించిన కేటీఆర్.. ‘‘అప్పుడు యూత్ డిక్లరేషన్.. ఇప్పుడు రేవంత్ బూతు డిక్లరేషన్’’ అంటూ ఎద్దేవా చేశారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు, యూత్ కమిషన్ ఏర్పాటు, ప్రైవేట్ కంపెనీల్లో 75 శాతం రిజర్వేషన్, యువతకు రూ.10 లక్షల రుణాలు, రూ.4 వేల నిరుద్యోగ భృతి, కాలేజీ విద్యార్థినులకు స్కూటీలు వంటి హామీలను ఆయన ప్రస్తావించారు. ఈ హామీల్లో ఎన్ని అమలయ్యాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
‘‘నోటిఫికేషన్ లేదు.. లూటిఫికేషన్ నడుస్తోంది. జాబ్ క్యాలెండర్ లేదు.. స్కాం క్యాలెండర్ నడుస్తోంది’’ అని కేటీఆర్ ఆరోపించారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు స్పష్టమైన కార్యాచరణ చూపడం లేదని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు.

తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్కు కీలక పాత్ర ఉందని కేటీఆర్ గుర్తుచేశారు. యువత, విద్యార్థుల పోరాటాలే చరిత్రను మలుపు తిప్పాయని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తామని తెలిపారు.
తెలంగాణ సాధన కోసం కేసీఆర్ రాజీనామా చేసి పోరాడారని గుర్తుచేసిన కేటీఆర్.. హామీలను అమలు చేయడంలో విఫలమైన సీఎం రేవంత్రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత, విద్యార్థులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.












Leave a Reply